వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రెండు నెలల ముందు నుంచే వల్లభనేని వంశీ అరెస్టు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఈ భయంతోనే వంశీ పారిపోయారు. కానీ, సడెన్గా బుధవారం ఓ ప్రెస్ మీట్లో వంశీ ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపోయారు. ఆ ప్రెస్ మీట్లో దోస్తులు వల్లభనేని వంశీ – కొడాలి నాని ఇద్దరూ కనిపించారు. చాలా రోజులుగా బయటకి రాకుండా పరారీలో ఉన్న ఇద్దరూ కనిపించేసరికి వల్లభనేని అరెస్టు ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది.
గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి ఘటన వల్లభనేని వంశీకి చుట్టుకుంది. ఆ కేసులో వల్లభనేని వంశీ ఏ – 71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడికి ప్రోద్బలం ఇచ్చింది వల్లభనేని వంశీనే అని వాంగ్మూలం ఇవ్వగా.. ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు చూస్తున్నారు. ఈ దాడి ఘటనలో వల్లభనేని వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి.
దీంతో ఆయన్ను నెల రోజుల క్రితమే అరెస్టు చేయాలని పోలీసులు భావించగా.. అరెస్టు భయంతో వంశీ పారిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. వంశీ కనీసం హైదరాబాద్లో కూడా ఉండడం లేదని, అమెరికా వెళ్లిపోయారంటూ ప్రచారం జరిగింది. అయితే పోలీసులు మాత్రం ఆయన జాడను పసిగట్టలేకపోయారు. వంశీని పట్టుకోవటం కోసం ప్రత్యేక బృందాలను కూడా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితం వంశీ ఉద్దేశపూర్వకంగా పారిపోయినందున ఆయన్ని అరెస్టు చేయడం కుదరలేదు. కానీ, ఇప్పుడు వైసీపీ కార్యాలయంలో ప్రత్యక్షం కావడతో ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకుంటే, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి.
నాలుగు నెలల క్రితం వరకూ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతోపాటు.. అప్పట్లో పోలీసులు కూడా వంశీ సొంత మనుషులుగా చెలామణి అయ్యేవారు. దీంతో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసును అప్పటి పోలీసులు మూసేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంశీ అరాచకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ క్రమంలోనే ఇప్పుడు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు.