టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. అమరావతి రింగ్ రోడ్డు భూ సమీకరణ అంశంలో నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్స్ట్రక్షన్స్, మరికొందరు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పీటీషనర్లపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సమీకరణ అంశంలో మాజీమంత్రి నారాయణ అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసుపై తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని కోరుతూ నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్స్ట్రక్షన్స్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు.
కాగా, నారాయణతో పాటు లింగమనేని సోదరులు, రామకృష్ణ కన్స్ట్రక్షన్స్ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు… పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ సీఐడీ అధికారులకు సూచించింది. ఈ కేసులో పిటిషనర్లపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.