ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ను కొత్త భయాలు వెంటాడుతున్నాయా ? కులం చూడం మతం చూడం అని అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఆ పంథాని కొనసాగిస్తున్నారా ? ఇతర కులాలను అణగదొక్కడం వెనుక దాగున్న కుట్ర కోణం ఏమిటి ? తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి ?
ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డిని కొత్త భయాలు వెంటాడుతున్నాయి.దీంతో తన వైఫ్యల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆయన కొత్త వ్యూహాలను రచిస్తున్నారనే చర్చ జోరందుకుంది. బలమైన సామాజిక వర్గాలను టార్గెట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చవచ్చనే ఆలోచనలో ఆయన ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
వాస్తవానికి కులం చూడం, మతం చూడం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ , తన ప్రభుత్వంలో అధికారం మొత్తం రెడ్డి సామాజికవర్గానికే కేంద్రీకృతం చేశారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ దీనిని కప్పిపుచ్చుకోవడానికి కొత్త తరహా వ్యూహాలను పన్నుతున్నారట.ఇతర కులాలను అణగదొక్కితే అది తనకు అనుకూలంగా మారుతుందనే జగన్ ఆలోచనగా కనిపిస్తోందట. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో బలమైన సామాజికవర్గంగా ఉన్న కాపు కులాన్ని ఆయన టార్గెట్ చేశారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఇప్పటికే వైసీపీ నాయకులు ఒకవైపు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఇక వైసీపీ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం పేటియం బ్యాచ్ ఎప్పటికప్పుడు ఎదురు దాడి చేస్తోంది. తరువాతి వరుసలో అదే సామాజికవర్గానికి చెందిన ముఖ్యలు, వ్యాపార వేత్తలు, మాజీమంత్రులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మాజీమంత్రి నారాయణ అరెస్ట్ కూడా ఇందులో భాగంగానే కనిపిస్తోంది.
పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ పేరుతో మాజీమంత్రి అరెస్ట్ చేయడం పై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లు నిజంగా ఈ వ్యవహారంతో నారాయణ ప్రమేయం ఉంటే ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం అసలు విషయాలను పక్కదారి పట్టించేందుకే నారాయణను అరెస్ట్ చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది.
నిజానికి జగన్ ప్రభుత్వానికి పేపర్ లీకేజికి, మాల్ ప్రాక్టీసెస్ కి తేడా కూడా తెలియనట్లుగా కనిపిస్తోంది.పరీక్షకి ముందు పేపర్ బయటకు వస్తే లీక్ అయినట్లు, అదే పరీక్ష మొదలైన తర్వాత పేపర్ బయటకు వస్తే అది మాస్ కాపీయింగ్ అవుతుంది. ప్రభుత్వం చెబుతున్న ప్రశ్నా పత్రం లీకేజి అనేది రాష్ట్రంలోని అనేక చోట్ల జరిగింది. అది కూడా పరీక్ష మొదలైన తర్వాత పేపర్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అప్పుడు ఆ అంశంలో కళాశాల యాజమాన్యం తో పాటు పరీక్ష నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందనే చెప్పక తప్పదు ఎందుకంటే పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వంటి వాటిపై పోలీసుల ప్రత్యేక నిఘా ఉంటుంది. గతంలో అనేక సందర్భాలలో పోలీసులు ఈ మాస్ కాపీయింగ్ ని భగ్నం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రభుత్వం చెబుతున్న అంశంలో పాఠశాల యాజమాన్యం తప్పు ఎంత ఉందో, ప్రభుత్వ వైఫల్యం కూడా అంతే ఉందనేది సుస్పష్టం.
కాగా, ఈ అంశంలో జగన్ సర్కార్ బోడి గుండుకి మోకాలికి ముడి పెడుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇదంతా కేవలం ఉద్దేశపూర్వకంగా మాజీమంత్రిని ఇరికేంచేందుకు చేస్తున్న కుట్ర అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయితే పోలీసులు ముందే ఎందుకు దృవీకరించలేదనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ లో కూడా నిందితుడు ఎవరో తెలియదనే పొందుపరచడం, సాక్షి చానల్ లో నారాయణ అని ప్రచారం జరిగాక పోలీసులు ఆయన పేరు చెప్పడం చూస్తుంటే పోలీసులు సాక్షి చెప్పినట్టు పనిచేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే జనసేన ఆధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చీల్చబోమంటూ ప్రకటన చేయడం, మరోవైపు టిడిపి , జనసేన పొత్తు ఉంటుందంటూ ప్రచారం జరుగుతుండడంతో జగన్ లో ఎన్నికల భయం పట్టుకుందని.. ఈక్రమంలో రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు నేతలను ఆర్ధికంగా, మానసికంగా దెబ్బకొట్టడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోందని పరిశీలకు అభిప్రాయపడుతున్నారు. అయితే టిడిపి , జనసేన పొత్తులపై ఆయా పార్టీలు ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ దీనిపై వైసీపీనే ఎక్కువగా ప్రచారం చేస్తుండడం కూడా జగన్ వ్యూహంలో భాగమే అని, దానిని కప్పిపుచ్చుకునేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ కి తెరతీశారని చర్చించుకుంటున్నారు.