ఆస్తుల పెంపు .. అనేక కేసుల్లో ఆయన పేరు
పదవిలోకి రాక ముందు అనేక పోస్టుల్లో పేరు తెచ్చుకున్న హైదరాబాద్ మేయర్ బొంతు రాంమోహన్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. పదవి చేపట్టాక ఆస్తుల పెంచుకోవడంతో పాటు అనేక కేసుల్లోఆయన పేరు వినిపించడంతో టీఆర్ఎస్ అధిష్టానం ఆయనను సైడ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ ఉద్యమ కారుడిగా.. విద్యార్థి నేతగా.. టీఆర్ఎస్ యువ విభాగం అధ్యక్షుడిగా ఏ పోస్టులో అయినా తన కంటూ ప్రత్యేక చాటుకున్న నేత బొంతు రాంమోహన్. కేటీఆర్ కు ముఖ్య అనుచరుడిగా మేయర్ పీఠం పై కూర్చున్న వ్యక్తి . ఉద్యమంలో ఆయన చేసిన సేవలకు టీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టింది. దీంతో ఆయన పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగి పోయింది. ఐదేళ్ళుగా తిరుగులేని నేతగా పేరుతెచ్చుకున్నారు. ఎటువంటి అసమ్మతి లేకుండా మేయర్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. పాలనలో తనదైన మార్కు చూపించారు బొంతురాం మోహన్ . సమస్య ఉందంటే ఏ రాత్రైనా అక్కడ వాలిపోతారన్న పేరు ఆయనకు ఉంది. ఇదంతా ఒకవైపే అంటున్నారు టీఆర్ఎస్ ముఖ్యనేతలు. ఆయన అసలు రంగు బయట పెడితే పార్టీకే చెడ్డపేరు వస్తుందన్న భావనలో ఉన్న అధినేతలు ఆయనను సైలెంట్ గా తప్పించే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
ప్రజా సేవకంటే ఆస్తుల సంపాదనపైనే దృష్టి
మేయర్ పీఠం పై కూర్చునే ముందు ఆయనకు పెద్దగా ఆస్తి పాస్తులు ఏమీ లేవు.ఎన్నికల్లో సైతం పార్టీ ఫండ్ తో పాటు ఆయన సన్నిహితులు, స్నేహితుల సహకారంతో ఖర్చులు వెళ్లదీసారని చెబుతున్నారు పార్టీ నేతలు. కాని ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎంతో పెరిగాయని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రజల సేవకంటే తన ఆస్తుల సంపాదనపైనే దృష్టి సారించినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఆయన పేరు బయట పడటమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. తన భార్య పేరుతో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భూముల కబ్జా చేశారని.. నగరంలోనూ అనేక ఆస్తులు కూడబెట్టుకున్నారని పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొద్ది రోజుల క్రింత పట్టుబడ్డ ఏసీపీ నర్సింహారెడ్డి కేసులోనూ ఆయన అనుచరుల పేర్లు రావడంతో ఆయన ప్రతిష్ట పార్టీలో మరింత దిగజారిందని భావిస్తున్నారు. కేటీఆర్ అండదండలతో మేయర్ గా మారిన రాం మోహన్ సొంత ఎజెండాతో పనిచేస్తున్నాడని భావిస్తున్న టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనను సైడ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ మధ్య ఓ మహిళతో ఆయన చనువుగా ఉంటున్నాడని.. అది తెలిసి ఇంట్లో కూడా గొడవలు జరిగినట్టు సన్నిహితులు చెబుతున్నారు. దీంతో రాంమోహన్ ను ఇంకా భుజాలపై మోస్తే తమకు చెడ్డపేరు రావడం ఖాయమని భావిస్తున్న అధిష్టానం ఆయనను భవిష్యత్ లో పదవులకు వీలైనంత దూరంగా ఉంచాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనకు అసలు టచ్ లేని మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయిస్తే ఓడి పోవడం ఖాయం అని పోటీకి బలవంతం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాంమోహన్ పోటీలో ఉన్నా లేక పోయినా నాగేశ్వర్ కు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది . విషయాన్ని ముందే పసిగట్టిన రాం మోహన్ పోటీకి విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ లైన్ నుండి అధిష్టానం ఆయనను ఎలా తప్పిస్తుంది.. అధిష్టానం వేసే ఎత్తులకు పై ఎత్తులతో పార్టీలో ఆయన ఎలా కొనసాగుతారో వేచిచూడాలి.