కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించి DSC ప్రక్రియపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. DSC నిర్వహణతో పాటు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం, భూ కుంభకోణాలపై జగన్తో నేరుగా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని లోకేష్ సవాల్ విసిరారు.
సోమవారం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని కంకిపాడులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల సమావేశంలో నారా లోకేష్ మాట్లాడారు. ఇప్పటివరకు దాదాపు 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. జగన్ తన ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేకపోయారని తీవ్రంగా ధ్వజమెత్తారు.
కేవలం 150 రోజుల్లో రికార్డు స్థాయిలో డీఎస్సీని విజయవంతంగా నిర్వహిస్తుంటే, దానిని అడ్డుకోవడానికి జగన్ వర్గం ఏకంగా 150 కేసులు వేసి కుట్రలు చేసిందని విమర్శించారు. అయితే, వాళ్ళు వేసిన కేసులన్నింటినీ కోర్టులు కొట్టివేయడమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి పెద్ద నిదర్శనమని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం TDP సిద్ధాంతమైతే.. బూతులు, విధ్వంసమే వైసీపీ విధానం అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ రికార్డు స్థాయి డీఎస్సీ భర్తీ ప్రక్రియను, దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు చేసిన కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెదేపా కార్యకర్తపైనా ఉందన్నారు. వైసీపీ అక్రమాలను ఎండగడుతూ, ప్రభుత్వ పారదర్శక పాలనను క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఈ సందర్భంగా శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.











