ఇంకా ఫాస్టాగ్ కొనుగోలు చేయని వారికి మరింత శుభవార్త. మార్చి1వ తేదీ వరకు ఫాస్టాగ్ లను ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం ఫాస్టాగ్ ధర రూ. 100గా ఉంది. మొత్తం 770 టోల్ ప్లాజాల వద్ద బ్యాంకులు మార్చి1 వరకు ఉచితంగా ఫాస్టాగ్ లను అందజేస్తాయి. దీనికి బ్యాలెన్స్ రీచార్జి చేసుకుంటే సరిపోతుంది. దేశంలో ఫాస్టాగ్ లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
కాగా, ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ తప్పనిసరి నిబంధన అమల్లోకి వచ్చింది. తొలి రెండు రోజుల్లో మొత్తం 87 శాతం వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులు జరిపాయని వెల్లడించింది. 60 లక్షల ట్రిప్పులకు గాను మొత్తం 95 కోట్ల రూపాయలు వసూలయ్యాయని, 100 టోల్ ప్లాజాల వద్ద 90 శాతం వాహనాలు ఫాస్టాగ్ తో వెళ్లాయని వివరించింది.
మై ఫాస్టాగ్ యాప్ లో కొన్ని పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చామని, వాహనం నంబరును నమోదు చేయగానే నగదు నిల్వల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది. ఈ వివరాలు ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో ఉంటాయని, ఆకుపచ్చ రంగు ఉంటే.. తగనన్ని నిల్వలు ఉన్నట్లు, కాషాయం రంగు ఉంటే.. నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఎరుపు రంగు ఉంటే.. బ్లాక్ లిస్టులో ఉన్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వివరించింది. ఫాస్టాగ్ ఆన్ లైన్ రీచార్జి కోసం టోల్ ప్లాజాల వద్ద 40 వేల పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు రవాణా శాఖ వెల్లడించింది.











