కరోనా మహమ్మారిని కట్టడి చేయడమే ధ్యేయంగా ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్ భారత్లో జోరుగా కొనసాగుతుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన దేశాలతో పోల్చితే రికార్డు స్థాయిలో మన దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ జరుగుతుంది. జనవరి 16న ప్రధాన మంత్రి చేతులమీదగా ప్రారంభమైన కరోనా వ్యాక్సినేషన్.. మొదలు పెట్టిన 35 రోజుల్లోనే కోటి మార్క్ను చేరుకుంది. దీంతో వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్న దేశాల్లో అమెరికా, బ్రిటన్ తర్వాతి స్థానాన్ని భారత్ సొంతం చేసుకుంది.

కోటి 88 వేల డోసులు @ 35 రోజలు..
వ్యాక్సినేషన్ ప్రారంభించి కేవలం 35 రోజులే అయింది. కానీ వ్యాక్సినేషన్ డోసుల లెక్కలు చూస్తే.. టీకా జోరుగా కొనసాగుతుందని చెప్పచ్చు. 35 రోజుల్లో 1,01,88,007 డోసులు అందించారు. అందులో 65 లక్షల మంది వైద్యారోగ్య సిబ్బందికి తొలి డోసు అందించగా.. వీరిలో 4 లక్షల మందికి రెండో డోసు కూడా ఇవ్వడం గమనార్హం. వీరితోపాటు.. 30 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి డోసులు అందించారు. వీరిలో 28 రోజులు గడిచిన వారికి ఫిబ్రవరి 13 నుంచి రెండో డోసు కూడా అందిస్తున్నారు.
ముందున్న అమెరికా..
కోటి డోసుల ఘనతను అమెరికా 31 రోజుల్లో పూర్తిచేసింది. నిజానికి, అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించి 66 రోజులైంది. ఇప్పటికి అక్కడ ఐదున్నర కోట్ల డోసులు అందించారు. అమెరికా కంటే 6 రోజుల ముందే వ్యాక్సినేషన్ ప్రారంభించిన బ్రిటన్.. ప్రపంచ వ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ.. అమెరికా కంటే చాలా వెనకబడిందని చెప్పాలి. బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రారంభమై 72 రోజులైంది.. ఇప్పటికి కోటి 65 లక్షల డోసులు అందించారు. తాజాగా భారత్ 35 రోజుల్లో కోటి మార్క్ పూర్తిచేసి మూడో స్థానంలో కొనసాగుతుంది. ఇలాగే కొనసాగితే.. బ్రిటన్ను అతి తొందరలోనే దాటుతుందనడంలో సందేహం లేదు.
Must Read ;- దేశంలో జోరుగా టీకాలు.. తగ్గుతున్న కరోనా కేసులు..!