ఎమ్మెల్సీ అనంతబాబు..ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. కాకినాడకు చెందిన దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హ*త్య చేసి, డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు పేరు రెండు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఐతే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసు మూలనపడింది. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అఘాయిత్యాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హ*త్య జరిగింది. తన మాజీ డ్రైవర్ను తానే హ*త్య చేశానంటూ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ వెల్లడించారు. తరువాత ఆయన్ను జైలుకు తరలించారు. నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసులు చక్రం తిప్పారు. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పొందిన అనంతబాబు రెండేళ్లుగా బయటే తిరుగుతున్నారు. నిరుపేదలైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకాలమ్మ, సత్యనారాయణ మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
ఈ హ*త్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చేలా.. హ*త్య జరిగినప్పుడు.. అంతకుముందు, తరువాత నిందితుడు తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారో పోలీసులు తేల్చలేదు. ఘటనా స్థలంలో ఎవరున్నారో గూగుల్ టేక్అవుట్, టవర్ లోకేషన్, సీసీ ఫుటేజీలతో గుర్తించలేదు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్మెన్లనూ సమగ్రంగా విచారించలేదు. సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా.. 88 రోజులకు 2022 ఆగస్టు 22న పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును న్యాయస్థానం తిరస్కరించింది. 2023 ఏప్రిల్ 14న అనుబంధ ఛార్జిషీట్ వేశారు. కావాలనే గడువులోగా ఛార్జిషీట్ వేయకుండా నిందితుడికి బెయిల్ వచ్చేలా అప్పటి ఎస్పీ, డీఎస్పీలు సహకరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును సిట్కు అప్పగించాలన్న వాదన దళిత వర్గాల నుంచి వినిపిస్తోంది.