(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
రాజరిక వ్యవస్థలో సామ్రాజ్యాధిపతులుగా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు, విస్తరించేందుకునేందుకు రాజులు ప్రత్యక్ష యుద్ధాలు చేసేవారు. విజయనగరం గజపతులు ఏర్పరిచిన మాన్సాస్ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకునేందుకు ప్రజాస్వామ్య వ్యవస్థలో యువరాణులు పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్నారు.
కోటానుకోట్లాది విలువ చేసే ఆస్తులు, వేలాది ఎకరాల సాగు భూములు, కోట్లాది రూపాయల బ్యాంకు డిపాజిట్లు, ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం.. దాని పరిధిలోని 108 ఆలయాలు కలిగిన మాన్సాస్ ఇప్పుడు అనేకానేక వివాదాలకు కేంద్రబిందువు అవుతోంది. పూసపాటి వంశీయులకు చెందిన విజయనగరం కోట ఆస్థానంగా 12 విద్యాసంస్థలతో విరాజిల్లుతున్న ‘మాన్సాస్’ పీఠానికి విజయనగరం గజపతుల వారసులైన ముగ్గురు యువరాణులు పోటీపడుతున్నారు.
పూసపాటి వంశానికి చెందిన విజయరామ గజపతిరాజు 1860లో విజయనగరంలో సంస్కృత కళాశాలను ఆ తర్వాత సంగీత కళాశాలను నెలకొల్పారు.1879లో మహారాజా అటానమస్ కళాశాలను నెలకొల్పి ఇంటర్మీడియట్ విద్యకు పునాదులు వేశారు. విజయనగర రాజ్యానికి చిట్టచివరి యువ రాజు పీవీజీ రాజు 1958లో తమ తండ్రి పేరు మీద ‘మహారాజా అలక్ నారాయణ గజపతి సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (MANSAS) అనే ట్రస్టును నెలకొల్పారు. తమ ఆస్తులన్నింటినీ ఆయన దీని పరిధిలోకి తీసుకొచ్చారు.
రాజులూ రాజ్యాలూ అంతరించిపోయినా పూసపాటి వంశీయులు విజయనగరం జిల్లాలో రాజకీయంగా కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు , వారి కుటుంబంలో తలెత్తుతున్న వివాదాలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. విజయనగరం గజపతి రాజుల కుటుంబ విషయాలు చాలా వరకూ గోప్యంగానే ఇప్పటివరకూ ఉండేవి.
సంచయిత గజపతిని మాన్సాస్ ట్రస్టు ఛైర్పర్సన్గా, సింహాచలం ధర్మకర్తగా నియమించిన తర్వాత రాజ కుటుంబంలోని వివాదాలు రచ్చకెక్కాయి. రాజకీయాల కోసం కుటుంబాల మధ్య వైరం పెరిగింది. కోట్లాది విలువచేసే ఆస్తులతో కూడి ఉన్న మాన్సాస్ ట్రస్ట్ పై కన్ను పడింది. దీంతో ఒకరిపై మరొకరు బహిరంగానే విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో ..
పూసపాటి వంశీయులకు చెందిన ఆస్తుల్లో అత్యంత విలువైనవి భూములే. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పీవీజీ రాజు తమకున్న వేల ఎకరాల భూములను దేవాలయాలు, వాటి ధూపదీప నైవేద్యాల కోసం దేవాదాయశాఖకు అప్పగించారు. ఆ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం దేవస్థానానికి దాదాపు 13 వేల ఎకరాల భూములు, 108 ఉపాలయాలు చేకూరాయి.
దేవాదాయశాఖ పరిధిలో ఉన్నప్పటికీ ఈ దేవాలయాలకు పూసపాటి వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచీ సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు రెండిటికీ ఒక్కరే ఛైర్మన్గా వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. పీవీజీరాజు, తర్వాత ఆనంద గజపతిరాజు, ఆయన తరువాత అశోక్ గజపతిరాజు అనువంశిక ధర్మకర్తలుగా వ్యవహరించారు.
2020 మార్చి 3వ తేదీన రోటేషన్ పద్ధతంటూ జీవో నెం. 74 ద్వారా అశోక్ గజపతి రాజును తొలగించి సంచైత గజపతిని రాష్ట్ర ప్రభుత్వం మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ గా నియమించింది. సంచైత ఆనంద గజపతి రాజు మొదటి భార్య కుమార్తె. ఈమె ప్రస్తుతం సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆకస్మిక నిర్ణయంతో మాన్సాస్ లో రాజకీయ వేడి రగులుకుంది.
రాజకీయాలకు చోటిచ్చిన అశోక్..
మాన్సాస్ ట్రస్ట్ విజయనగరం రాజుల అంతర్గత వ్యవహారంగానే ఉండేది. ఇన్నేళ్ల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా , పాలకులు మారినా దానివైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత రాజకీయాలు చోటుచేసుకున్నాయి. ఆయన కుమార్తె అదితి గజపతిని, ఏపీ స్టేట్ ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ సి. కుటుంబరావును, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఐ.వి.రావును మాన్సాస్ డైరెక్టర్లుగా నియమించారు.
అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఈ వ్యవహారం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించి సంచైతను నియమించడంతో రాజకీయ వివాదం పరాకాష్టకు చేరుకుంది.
యువరాణుల మధ్య పోటీ
రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా గజపతిరాజుల వారసులైన ఆనందగజపతి రాజు తొలి భార్య ఉమాగజపతి కుమార్తె సంచైతను ఛైర్ పర్సన్గా, రెండో భార్య సుధా గజపతి కుమార్తె ఊర్మిళ ను, అశోక్ గజపతి కుమార్తె అదితిని డైరెక్టర్లుగా నియమించింది. ‘తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్నికి ఆజ్యం జతచేసింది. ఇదే అదనుగా సంచైత- వెనువెంటనే పీఠంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తుండగా, అదితి తన తండ్రి అశోక్ అండదండలతో న్యాయపోరాటం ద్వారా కుర్చీ కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆనందగజపతికి వాస్తవ వారసురాలను తానే అయినందున ఆ పీఠం తనకే దక్కాల్సిన అవసరముందని ఊర్మిళ తనదైన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వాస్తవ పరిస్థితిని ఆయనకు వివరించి తదుపరి కార్యాచరణకు సమాయత్తం అవుతున్నారు.
యువరాణుల పోటీలో ఎవరిది పైచేయి అవుతుందో, మాన్సాస్ రాజ్యానికి పట్టపురాణిగా ఎవరవుతారో వేచిచూడాలి.