( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగైంది. అప్పటి నుంచి పార్టీని బతికించుకునేందుకు మిగిలివున్న ఒకరిద్దరు నాయకులు అష్టకష్టాలు పడుతున్నా ప్రజల విశ్వాసం మాత్రం పొందలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట వైఎస్సార్సీపీలో చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకులు కరువయ్యారు. ప్రభుత్వ విధానాలపై అడపదడప నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ఆ పార్టీకి తగిన మైలేజీ రావడం లేదు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కడా డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయారు. జిల్లా అధ్యక్షులను నియమించుకునేందుకు సరైన అభ్యర్థులు లేక ఉన్న వారితోనే పార్టీని నెట్టుకొస్తున్నారు. త్వరలో మరో మారు స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటో ది. అందులో భాగంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా శనివారం రైతు హక్కుల దినోత్సవంగా “కిసాన్ అధికార్ దివాస్”గా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ విశాఖపట్నం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణుల అంతా కలిసి రైతులకు మద్దతుగా సత్యాగ్రహం దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, నగర కార్పొరేటర్ అభ్యర్థులు, డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జిలు, కార్యకర్తలు,అనుబంధ సంఘాల నాయకులు,అభిమానులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కొన్ని సీట్లుతోనైనా బోణి కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.