కేంద్రంలో భారతీయ జనతా పార్టీని కట్టడి చేసేందుకు, ఆ పార్టీ విధానాలపై పొరాడేందుకు వామపక్షాలతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చేతులు కలుపుతున్నాయా… ఆ పార్టీల మధ్య అలాంటి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా… అంటే అవుననే సమాధానం అనిపిస్తోంది. తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ మధ్య జాతీయ స్ధాయిలో అన్ని పార్టీలను ఏకం చేసే పనికి పూనుకున్నారు.
ఇందుకోసం ఆయన కాలికి బలపం కట్టుకుని అన్ని రాష్ట్రాలు తిరిగారు. ఆ తర్వాత ఆ ప్రయత్నాలు విరమించుకున్నారు. మళ్లీ దాదాపు ఏడాదిన్నర తర్వాత గత నెలలో మళ్లీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జాతీయ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారంటూ కథనాలు వచ్చాయి. ఆ కథనాలను సీఎం కేసీఆర్ తోసిపుచ్చారు. అలాంటిదేమీ లేదని కూడా అన్నారు.
అక్కడితో ఆ వార్తలు, కథనాలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ, మూడో ప్రత్యామ్నాయానికి కామా పెట్టారే తప్ప ఫుల్ స్టాఫ్ పెట్టలేదని అంటున్నారు. తాజాగా భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాయకుడు సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్నామ్నాయం రావాల్సి ఉందని, దీనికి తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నడుం బిగిస్తే తామంతా ఆయన వెంట నడుస్తామని అన్నారు. సీపీఐ నారాయణ చేసిన తాజా ప్రకటనతో మళ్లీ మూడో ప్రత్యామ్నాయం ఆశలు తెరమీదకు వచ్చాయి.
కేంద్రం విధానాలే కారణమా..
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. రైతు వ్యతిరేక విధానాలు, రైల్వేతో సహా బీఎస్ఎన్ఎల్ ప్రయివేటీకరణ, ఎల్ఐసీని నిర్వీర్యం చేసే ఆలోచనలు… ఇలా అన్నీ ప్రజావ్యతిరేక విధానాలేనని వామపక్షాలు అంటున్నాయి. మరోవైపు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తోందని కూడా ముఖ్యమంత్రులు కేసీఆర్, మమతా బెనర్జీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఈ సమయంలో ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమిని రూపొందించి దాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనలో ప్రతిపక్ష పార్టీలున్నాయి. ఇదే విషయాన్ని సీపీఐ నారాయణ ప్రకటించారని అంటున్నారు.
తెలుగుదేశం కలుస్తుందా..
భారతీయ జనతా పార్టీని నిర్వీర్యం చేయాలనే ఆలోచనకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అస్సలు పడదు. పైగా కేసీఆర్ తన శిష్యుడని, తన మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన వాడని చంద్రబాబు నాయుడికి చులకన భావం ఉందంటున్నారు.
అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు పని చేసే అవకాశం ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కూటమిలో భాగస్వామి అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు. ఆయన ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నారని, అలాంటప్పుడు ఆయన కూడా ఈ కూటమిలో కలిసే అవకాశాలు ఉండవని చెబుతున్నారు.
ఈ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇవ్వకూడదన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఆ పార్టీతో నిరంతరం విబేధించిన తాను వారితో చేతులు కలపనని గతంలో కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు ఆయన దానికే కట్టుబడి ఉంటారని తెలంగాణా రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి.