ప్రముఖ టాలీవుడ్ సినీయర్ గాయకుడు జీ. ఆనంద్ మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ .. ఆయనకి ఘన నివాళులర్పించారు మెగాస్టార్ చిరంజీవి. నిజానికి చిరంజీవి మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ లో నర్తించిన మొదటి పాటకి గళం విప్పింది జీ.ఆనంద్ నే. ఆయన పాడిన ‘ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా’ అనే పాటలో చిరంజీవి, కథానాయిక రేష్మీ రాయ్ తో కలిసి డ్యాన్స్ చేస్తారు. డ్యాన్సర్ గా చిరు మొదటి సినిమా కూడా ఇదే. అందుకే ఆనంద్ మరణాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోతున్నారు చిరంజీవి. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చిరంజీవి జీ.ఆనంద్ కు ఘన నివాళులర్పించారు.
‘ఎన్నియల్లో ఎన్నియల్లో ఎందాకా అంటూ.. నా సినీజీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరు దరహాసి ఆనంద్ కర్కశమైన కరోనా బారిన పడి.. ఇక లేరు అని నమ్మలేకపోతున్నాను. మొట్టమొదటి సారి వెండితెర మీద ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయన తో నాకు ఒక అనిర్వచనీయమైన అవినావభావ బంధం ఏర్పరిచింది. ఆయన ప్రస్థానం నన్ను వెన్నాడే విషాదం, ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియచేసుకుంటున్నాను’. అంటూ చిరంజీవి తెలిపారు.











