ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీసీలు అంతా ఏకమై పార్టీ ఏర్పాటుకు గుంటూరులో సమావేశమయ్యారు. అయితే బీసీలు పార్టీ ఏర్పాటు చేయడంపై రాజకీయ విశ్లేషకుల అంచనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు ఆధ్వర్యంలో 13 జిల్లాలకు చెందిన 52 మంది బీసీ కులాల నేతలు ఇవాళ గుంటూరులో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. బీసీలంతా ఏకమై రాజ్యాధికారం సాధిస్తేనే బీసీలు అన్ని రంగాల్లో వృద్ధి సాధిస్తారని సమావేశానికి హాజరైన ఆ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.
సగానిపైనా మనమే… ఏకమైతే అధికారం మనదే
ఏపీలో 113 కులాలకు చెందిన బీసీలు 13 జిల్లాల్లోని ప్రతి గ్రామంలో ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 55 శాతం వీరిదే. అయితే రాష్ట్రంలోని అన్ని పార్టీల్లోనూ బీసీ నేతలున్నారు. అలాగే వారి జనాభా కూడా ఎవరికి నచ్చిన పార్టీలో వారు కొనసాగుతున్నారు. బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు, బీసీ నేతలు ఒక పార్టీ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘ఎన్నాళ్లు ఒకరి మోచేతి నీళ్లు తాగుతాం. జనాభాలో సగానికిపైగా మనమే ఉన్నాం. మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనదే’నని బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీసీ పార్టీ ఏర్పాటులో భాగంగానే గుంటూరులో 13 జిల్లాల నేతలు సమావేశమయ్యారు. అయితే, రాజ్యాధికారమే వీరి లక్ష్యమా? వీరి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అనుమానాలు రాకమానవు.
బీసీల పార్టీ వెనుక ఉన్న శక్తులెవరు?
ఏపీలో బీసీలందరూ కలసి పార్టీ పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాధికారం సాధించుకోవచ్చు. కొన్ని పార్టీల పుట్టుక పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో బీసీలంతా ఏకమై పార్టీ ఏర్పాటు చేసుకోవాలన్న ఆకాంక్షను అందరూ స్వాగతించాల్సిందే. అయితే, వారిని ఎవరైనా పావులుగా వాడుకుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగు దేశమే. అందుకే ఆ పార్టీకి మొదటి నుంచీ అండగా నిలుస్తున్న బీసీలను దూరం చేసే వ్యూహంలో భాగంగానే ఏపీలో బీసీ పార్టీ ఏర్పాటు జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీసీలు రాజకీయంగా ఎదగాలి
ఎక్కడయినా అందరూ అభివృద్ధి సాధించినప్పుడే ఆ దేశం పురోగమిస్తుంది. ఏపీలో అత్యధికంగా ఉన్న బీసీలు ఇప్పటకీ పెద్దగా అభివృద్ధికి నోచుకోలేదనే చెప్పాలి. స్వాతంత్ర్యం వచ్చాక బీసీలకు రాజ్యాధికారం దక్కకపోవడమే ఇందుకు కారణమని బీసీ నేతలు వాదిస్తున్నారు. వారు చెప్పేదాంట్లో కొంత నిజం ఉండవచ్చు. బీసీలకు ఓ పార్టీ ఉండాలను కోవడం తప్పేంకాదు. అయితే కులాల ప్రాతిపదికన పార్టీల ఏర్పాటు అనేది కొంచెం సాహసమే. ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో అనేక మంది బీసీ నేతలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏపీలో ముఖ్యమంత్రి పదవి బీసీలకు దక్కలేదనే అసంతృప్తి బీసీలను వెంటాడుతోంది. అందుకే బీసీలంతా ఏకమై పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నామని ఆ సంఘాల నేతలు ప్రకటించారు. వారి ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం…