ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి పెట్టి సొంత డబ్బా కొట్టుకోడానికి ఎగబడుతుండే జగన్.. సొంత ఖజానాను నింపుకోవడమే తప్ప.. అక్కడినుంచి పైసా కూడా బయటకు తీయరనే సంగతి అందరికీ తెలిసిందే.
గతంలో బెజవాడ వరదల్లో మునిగిపోతే.. పార్టీ తరఫున కోటి రూపాయల సాయం అని ప్రకటించి.. తూతూమంత్రంగా లోకల్ లీడర్ల్తో నీటిపొట్లాలు పంచి.. అక్కడితో కోటికి లెక్క సరిపెట్టేశారు. మొన్నటికి మొన్న విశాఖ ఉక్కుప్రమాద మృతులను పరామర్శించడానికి వెళ్తూ.. అక్కడికి వెళ్లగానే ఆర్థిక సాయం ప్రకటిస్తారని చాలా ఆర్భాటం చేశారు. కంటితుడుపు శవరాజకీయాలు తప్ప.. కానీ కూడా విదిల్చలేదు.
కానీ.. ఇప్పుడు సాయికృష్ణ విషయంలో మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రేమ ముంచుకొచ్చింది. కాపు నాయకులంతా తలా యాభై వేలు వేసుకుని.. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని అంటున్నారు. కాపులకు మాత్రం క్యాష్ బిస్కెట్లు వేయడానికి సిద్ధపడుతున్న కుట్ర వెనుక అసలు రహస్యం ఏమిటి?
సమాజాన్ని కులాల పరంగా చీల్చాలనేది మౌలికంగా జగన్ ముఖ్యోద్దేశం. అయితే సమాజంలో బలమైన కాపు వర్గం.. తెలుగుదేశం- జనసేన- బిజెపి కలయికతో కూడిన ఎన్డీయే ప్రభుత్వం పట్ల అచంచలమైన నమ్మకంతో ఉన్నారనేది స్పష్టం. అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజల్లాగానే కాపుల్లో కూడా ప్రభుత్వం పట్ల విశ్వాసం, ప్రశంస వ్యక్తమవుతున్నాయి. అయితే వేరే ఎక్కడా ఠికానా లేకపోవడం వలన తన పార్టీలో మిగిలిన కొద్దిమంది కాపు నాయకులతో జగన్ రకరకరాల టక్కుటమార గజకర్ణగోకర్ణ విద్యలు ప్రదర్శించడానికి సాహసిస్తున్నారు.
సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం తారస్థాయికి చేరుకుంటున్న సమయంలో జగన్ తన కుటిల రాజకీయానికి తెరలేపారు. బెంగుళూరు యలహంక ప్యాలెస్ నుంచి తరలివచ్చి.. పరామర్శ డ్రామా నడిపించారు. ఆయన నోటమ్మట కించిత్తు సాయం కూడా ప్రకటించలేదు. కానీ.. ఆ తల్లి వేదనను గమనించి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలిపించుకుని ఆత్మీయంగా పలకరించి భరోసా ఇచ్చిన తర్వాత.. మొత్తం వివాదం సద్దుమణిగిపోయింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి మీద ప్రభుత్వం చర్య తీసుకుంటోంది. అన్నింటినీ మించి.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల పట్ల సాయికృష్ణ తల్లి స్వయంగా అపరిమితమైన నమ్మకాన్ని, గౌరవాన్ని వెలిబుచ్చారు. ‘చంద్రబాబు గారు నాకు న్యాయం చేస్తానన్నారు.. చేశారు.. నాకు ఇంకేం అక్కర్లేదు’ అంటూ చాలా స్పష్టంగా తెగేసి చెప్పారు. తన కుట్రలు ఫలించకపోయేసరికి జగన్ అసహనానికి గురయ్యారు. ఆ కేసుకు కులం రంగు పులిమే కుటిల ప్రయత్నానికి దిగారు.
తన పార్టీలో అరకొరగా మిగిలిన కాపు నాయకుల్ని పోగేసి.. వారిద్వారా కులంరంగు పులిమిన విమర్శలు చేయించి.. చందాలు వేసుకుని సాయం చేస్తామంటూ బిస్కట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు ఛీత్కరించుకుని.. 11 సీట్లతో బెంగుళూరు ప్యాలెస్ కు పరిమితం చేసిన తర్వాత.. అనేక సందర్భాల్లో వేర్వేరు కుటుంబాలను పరామర్శించే డ్రామా ఎపిసోడ్ లను జగన్ నడిపించారు. కానీ.. ఎక్కడా వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందించి అండగా నిలిచిన సందర్భాలు లేవు. కానీ.. సాయికృష్ణ కుటుంబానికి కుల నాయకులతో డబ్బులు ఇప్పిస్తున్నారంటే.. అది కుటిలత్వమే.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే.. వారు పరామర్శించిన అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం ఆయాకులాలకు చెందిన తమ పార్టీ నాయకులతో ఇప్పించవచ్చు కదా.. అనేది ప్రశ్న. ఇలా చందాలు వేసుకోకపోతే.. పార్టీ తరఫున ఇవ్వడానికి గతిలేని స్థితిలో ఉన్నారా? పాలన సాగించిన రోజుల్లో దోచుకున్న వేలకోట్లలో కొంత పంచవచ్చు కదా..? అనేది చర్చ. కాపు సామాజిక వర్గంలో కూటమి సర్కారు పట్ల ఉన్న విశ్వాసాన్ని చూసి ఓర్వలేక నడిపిస్తున్న ఇలాంటి డ్రామాలు జగన్ కు బూమరాంగ్ అవుతాయని విశ్లేషకులు అంటున్నారు.











