ఏపీలో ప్రస్తుతం ఒక్కసారిగా రాజకీయాలు వేడేక్కాయి. మీ భాష మార్చుకోవాలంటే.. మీ భాష సరిగా లేదని అధికార, ప్రతిపక్ష నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. మొన్నటికి మొన్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన సాహసానికి బుద్ధా వెంకన్న అండ్ టీం బహుబలి బల ప్రదర్శన మాదిరిగా అడ్డు నిలిచి తడాఖా చూపారు. అయితే అధికార పార్టీ, బ్యూరోక్రాట్స్ చేసిన దైర్య, సాహసాలు గురించి కూడా ప్రస్తావించాల్సి పరిస్థితి కనిపిస్తోంది. ఆనాడు జోగి చేసింది తెగింపైతే.. ప్రతిపక్షనేత, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు ఇంటిపై ఓ ఎమ్మెల్యే మంది మార్బలంతో ముట్టడికి యత్నిస్తుంటే.. తెలిసి కూడా మిన్నకుండిపోయిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం చేసింది మాత్రం బరితెగింపేనని చెప్పుకోవచ్చు. నాడు జోగి రాజేసిన జ్వలాలు.. నేడు టీడీపీ శ్రేణులను పూర్తి ఉత్తేజుతులను చేసిందనే చెప్పుకోవాలి. చంద్రబాబు ఇంటిపైకి వెళ్లి భంగపడిన జోగి .. డిఫెన్స్ లో పడి ఉన్న టీడీపీ నెత్తిన పాలు పోశాడు. నాటి నుంచి తెలుగుదేశం పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయింది. ఇక అధికార పార్టీ వైఫల్యాలపై ముప్పేట దాడికి రంగం సిద్దం చేయాల్సిన సమయం అసన్నమైందని నేతలను సమాయత్తపరిచారు అధినేత చంద్రబాబు.
మంత్రుల బూతులు మరిచారా?
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తండ్రికున్న ఆ కాస్తా మంచి పేరును చెరిపి .. తన అసమర్థతను తాడేపల్లి కేంద్రంగా ప్రపంచ దేశాలకు చాటారు. డే వన్ నుంచి కోర్టు మొట్టికాయాలు, చీదరింపులతో మొదలైన పాలన.. ఆంధ్రాను గంజాయి సాగు కేంద్రంగా.. డ్రగ్ మాఫియాగా మార్చారు అన్న వాదనతో ప్రస్తుతం బండిని లాక్కొస్తోంది అధికార పార్టీ. ఈ వాదనల్లో నిజనిజాలు పక్కన పెడితే.. ప్రతిపక్షాలకు మాత్రం ప్రధాన అస్త్రాలుగా మారాయి. జగన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఒకపక్క ఏకరవు పెడుతూ.. గంజాయి, డ్రగ్ సరాఫరా వంటి అంశాలపై విమర్శనాస్త్రాలను సంధించే పనిలో పడ్డారు టీడీపీ నేతలు. ఆ క్రమంలోనే మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళకు నోటీసులు.. దానిపై పట్టాభి ఫైర్.. కట్ చేస్తే టీడీపీ కేంద్ర కార్యాలయంపై రౌడీ మూకలు దాడి. భాష ప్రధానం, హుందా రాజకీయాలకు లాంగ్వేజ్ మొయిన్ అని ఇప్పుడు గుర్తుకొచ్చింది కాబోలు అధికార వైసీపీకి. గద్దెనెక్కి పాలనా పగ్గాలు చేతపట్టిన నాటి నుంచి బూతుల మంత్రులను పురికొల్పి తిట్టించిన బూతుపురాణం సీఎం జగన్ రెడ్డి అండ్ కో మారిచారు కాబోలు .. నేడు బూతు.. బూతు .. అంటూ నీతులు వర్లిస్తున్నారు.
మీది బాగుంటే.. మాదీ బాగుంటుంది
సన్యాసి నాయుడు.. పప్పు.. దద్దమ్మ.. పిట్టలదోరా.. చెత్త నా డిష్యూ అంటూ చంద్రబాబును, లోకేష్ ను పట్టుకుని బూతుల మంత్రి దెయ్యం పట్టినట్లు తిడుతుంటే .. ఏపీ ప్రజలు చెవులు మూసుకోవడమే కాదు .. టీవీలను సైతం బంద్ చేసుకున్న రోజులు గుర్తే. కానీ ప్రజలు ఇప్పుడు కళ్ళు తెరిచారు మిస్టర్ రెడ్డి.. మైండ్ ఇట్ అని విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. మీరు మంత్రులతో తిట్టించిన తిట్ల కన్నా.. పట్టాభి వాడిన భాష.. అంత వరెస్ట్ పదజాలమైతే కాదు అన్న వాదన కూడా లేకపోలేదు. అయితే పుండుపై పట్టాభి చల్లిన గుంటూరు కారం మాత్రం.. ఎక్కడో తాకాల్సిన చోట తాకిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలా ఏపీ రాజకీయాల్లో భాషను బేస్ చేసుకుని రాజకీయాలు నడుస్తున్నాయి. మీ భాష సరిగా ఉంటే.. మా భాష అంతకన్నా బాగుంటుందని.. ఎక్కడా తగ్గేదె లేదంటూ ఇలా కౌంటర్లను ఎక్కు పెడుతోంది ప్రతిపక్ష తెలుగుదేశం.











