విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టు ఇక పరుగులు తీయనుంది. పరిపాలన రాజధానిగా అధికార పార్టీ విశాఖను ఖరారు చేయడంతో- ఒకవైపు కోర్టు కేసులు నడుస్తూనే ఉన్నప్పటికీ, ఆంక్షలు ఉన్నప్పటికీ.. వాటితో నిమిత్తం లేకుండా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పోతోంది. అందులో భాగంగా విజయదశమిని పురస్కరించుకొని మెట్రో రైల్ కార్యాలయాన్ని విశాఖలో ప్రారంభించారు.
ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ, మెట్రో రైలు ప్రాజెక్టు మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ పీ రామకృష్ణ రెడ్డి , విఎంఆర్డిఎ, జీవీఎంసీ కమిషనర్లు కోటేశ్వరరావు, జి సృజన, శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్ హాజరయ్యారు.
ఎల్ఐసి భవనసముదాయంలో ఏర్పాటుచేసిన మెట్రోరైల్ ప్రాజెక్టు కార్యాలయ ప్రారంభం అనంతరం , కాన్ఫరెన్స్ హాల్లో విశాఖలో ఏర్పాటు చేయబోయే మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను రాష్ట్ర మంత్రులు,అధికారులు వీక్షించారు. విశాఖ అభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ ప్రాజెక్టు కు శ్రీకారం జరుగుతున్నదనీ మంత్రి బొత్స చెప్పారు.
విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ ఏరియా లో 79.91 కి మీ లైట్ మెట్రో రైలు కారిడార్ లు, అదేవిధంగా 60 కి మీ మేర మో డ్రన్ ట్రామ్ కారిడార్ ల అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందించడం జరిగిందన్నారు.
లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్ కోసం వేర్వేరుగా రెండు డీపీఆర్( డీటైల్డ్ ప్రాజెక్ట్) ల రూపకల్పన లకు యు ఎం టీ సి కన్సల్టెంట్ లను ప్రభుత్వం నియమించింది. మెట్రో డి పి ఆర్ ను ఈ సంవత్సరం నవంబర్ రెండో వారంలో, మోడ్రన్ ట్రామ్ డిపిఆర్ను డిసెంబర్ రెండో వారంలో ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ట్రాఫిక్ ఇతర అంశాలపై క్షుణ్నంగా అధ్యయనం చేసిన అనంతరం 75.31 కి మీ లో 4 కారిడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని కన్సల్టెంట్లు సిఫార్సు చేశారు.
స్టీల్ ప్లాంట్ – కొమ్మాది జంక్షన్, గురుద్వారా – పాత పోస్ట్ ఆఫీస్, తాడిచెట్లపాలెం – చిన్న వాల్తేర్ వాల్తేర్ , కొమ్మాది జంక్షన్ – భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ప్రతిపాదనలను తయారు చేశారు.
మోడ్రన్ ట్రామ్ కు సంబంధించి మూడు కారిడార్లలో 60. 20 కి మీ మేర డీ పీ ఆర్ ప్రతిపాదన ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్ఏడి – పెందుర్తి, స్టీల్ ప్లాంట్ గేటు – అనకాపల్లి , పాత పోస్టాఫీసు- భీమిలి బీచ్ రోడ్డు వయా రుషికొండ వరకూ డీపీఆర్ల ప్రక్రియ జరుగుతోంది. లైట్ మెట్రో ప్రాజెక్టు డెవలప్మెంట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నవంబర్లో ప్రారంభించనున్నామని, అర్హతలున్న డెవలపర్ల ఎంపిక, కాంట్రాక్టర్ల సంతకం ప్రక్రియలన్నీ మార్చి 2021నాటికి పూర్తి అవుతాయని మంత్రి బొత్స విలేకరులకు తెలిపారు తెలిపారు.











