(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఉత్తరాంధ్రుల కల్పవల్లి, విజయనగరం ప్రజల ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం. విజయదశమి అనంతరం వచ్చే మంగళవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ సంబరాన్ని ఈ ఏడాది నెలకొన్న కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ప్రత్యక్షదర్శనానికి అవకాశం లేనప్పటికీ ప్రత్యామ్నాయం కల్పిస్తూ, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమైంది.
శోభాయమానంగా విజయనగరం
పైడితల్లి అమ్మవారి ఉత్సవాల నేపధ్యంలో చారిత్రక ప్రసిద్ధి గాంచిన విజయనగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. పట్టణంలోని చారిత్రక, సాంస్కృతిక ప్రసిద్ధి గాంచిన పైడితల్లి అమ్మవారి ఆలయాలు చదురుగుడి, వనంగుడి, కోట, మూడు లాంతర్లు, గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి ఆలయం, ఇతర ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాలతో అలంకరించారు. వాణిజ్య, వ్యాపార సంస్థలను ఎవరికి వారుగా విద్యుత్ దీపాలతో అలంకరించుకోవడంతో పట్టణానికి ప్రత్యేక శోభ చేకూరింది.
ఈ ఏడాది విజయదశమి ఆదివారం కావడం వెనువెంటనే సోమవారం అమ్మవారి తొలేళ్లు, మంగళవారం సిరిమాను నిర్వహించనుండటంతో పట్టణంలో పండుగ సందడి, జన రద్దీ ఎక్కువైంది. ప్రతీయేటా సిరిమానుకు ముందు మూడురోజులు నిర్వహించే విజయనగరం ఉత్సవాలు కరోనా నేపధ్యంలో ఈ ఏడాది చేపట్టకపోవడం, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు, పులివేషాలు నిషేధించడం వల్ల కొంత వెలితి చోటుచేసుకుంది.
మూడు శతాబ్దాలుగా..
పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా పూసపాటి రాజుల ఇలవేల్పుగా భాసిల్లుతోంది. పైడితల్లి అమ్మవారి దేవాలయం విజయనగరం మూడు లాంతర్లు కూడలి వద్ద 1757లో నిర్మించారు. 1758లో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటివరకూ సుమారు మూడు శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీ.శ. 1757 ధాత నామ సంవత్సరం విజయదశమి వెళ్ళిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు.
ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుపల్లి వెంకటరావు ఏడో తరంవాడు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భక్తుల్ని ఆశీర్వదిస్తారు.
చారిత్రక నేపథ్యం ..
అమ్మవారుగా కొలవబడుతున్న పైడితల్లి విజయనగరం పూసపాటి రాజవంశీయులు పెద విజయరామరాజు చెల్లెలు. పసిప్రాయం నుండి అధ్యాత్మిక భావాలతో దేవీ ఉపాసన చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను కలతపెట్టింది. బుస్సీ కుట్రకు లొంగిపోయిన విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాల్ని లెక్కచేయలేదు.
1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించారు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజయం విజయరామరాజునే వరించింది. ఆ రోజు రాత్రి దేవి కలలో కనిపించి అన్న ప్రాణాలకు వచ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది.

ఉపవాసదీక్షలో ఉన్న ఆమె పతివాడ అప్పలనాయుడు, మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకొని బొబ్బిలి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకున్నది. తన ప్రతిమ పెద్దచెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజలు, ఉత్సవాలు చేయమని చెప్పి ఆమె దేవిలో ఐక్యమయింది. అప్పటినుండి ఆమెను అమ్మవారిగా కొలుస్తూ ప్రతి ఏటా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు.
వైభవంగా అమ్మవారి పండుగ : కలెక్టర్
ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాల మేరకు పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలను ఈ ఏడాది కూడా రాష్ట్ర పండుగగా, వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. సంప్రదాయాలకు భంగం కలగకుండానే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరిపేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈనెల 27న అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు పార్లమెంటు, శాసనసభ్యులు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకొనేందుకు వస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు.

అధికారులంతా సమన్వయంతో సమిష్టిగా పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. ఉత్సవాల నిర్వహణకోసం ఈ ఏడాది ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. దేవాదాయశాఖ తరపున కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు దేవస్థానంకు చెందిన డిప్యూటీ కమిషనర్ ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తిని నియమించారని చెప్పారు.
సిరిమాను తయారీలో అనుభవజ్ఞులైన అటవీశాఖ అధికారి జి.లక్ష్మణ్ను కూడా మూడు రోజులపాటు ఉత్సవాల ప్రత్యేక అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారని, వారు ఇప్పటికే విధుల్లో చేరారని తెలిపారు.
శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు : డిఐజి
పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎల్.కే.వి. రంగారావు తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై విజయనగరం ఎస్పీ బి. రాజకుమారితో కలిసి సమీక్షించారు. సిరిమానోత్సవం ప్రజల మనోభావాలు, భక్తి, సంప్రదాయాలకు సంబంధించినదైనందున బందోబస్తు నిర్వహించే పోలీసులు, మహిళా సంరక్షణ పోలీసులు ప్రజలతో మర్యాదతో ప్రవర్తించాలన్నారు.
కరోనా కారణంగా గుమిగూడి ఉండే ప్రజల్లో తిరగడం అనర్ధదాయకమని, కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇంటికే పరిమితం కావాలని, టివిల్లో సిరిమానోత్సవాన్ని తిలకించి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలకు హితబోధ చేశారు.











