మనిషి జీవితంతో 108 సంఖ్య పెనవేసుకుపోయింది. బతికున్న మనిషికీ, ప్రమాదంలో ఉన్న మనిషికీ 108 అనేది ఓ తారక మంత్రం. దీనికి ఎందుకింత ప్రాధాన్యం? మంత్రాన్ని 108 సార్లే ఎందుకు చదవాలి? దాని వెనకున్న రహస్యం ఏమిటి? ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులకు కూడా ఇది పవిత్రమైన నంబరే. మనిషిలోని శ్వాసకూ, యోగ శాస్ర్తంలోని షట్చక్రాలకూ ఈ సంఖ్యకూ అవినాభావ సంబంధం ఉంది. మన జ్యోతిష్కుల లెక్క, శాస్ర్తవేత్తల లెక్క ఒక్కలానే ఉంది. మన గెలాక్సీలో 27 నక్షత్ర మండలాలను వీరు గుర్తించారు. వాటినే జ్యోతిష్కులు 27 నక్షత్రాలు అన్నారు. ఒక్కో నక్షత్రాన్ని నాలుగు పాదాలుగా విభిజించి గుణిస్తే 4 × 27 = 108 అవుతుంది. మన వేదాల సారం అంతా ఉపనిషత్తులలో ఉంది. ఇవి కూడా 108 ఉన్నాయి. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. ఇలా మన అనేక రచనలు కూడా 18 అధ్యాయాలకే పరిమితమయ్యాయి.
మన అంకెలకూ ఈ సంఖ్యలకూ కూడా అవినాభావ సంబంధం కనిపిస్తోంది. ఒకటిని సూర్యుడిగా భావిస్తారు. 8ని శనిగా చెబుతారు. ఈ రెండిటితో ముడిపడిన సంఖ్య 18గానీ, 108 గానీ. మరో విశేషం ఏమిటంటే ఈ రెండింటినీ కలిపితే 9 సంఖ్య వస్తుంది. నవగ్రహాల సంఖ్య కూడా తొమ్మిదే. ఇక తొమ్మిది తర్వాత వచ్చేది సున్నాయే. దానికి విలువ ఉందా విలువ లేదా అంటే అది కూడా చెప్పడం కష్టమే. అంతమూ అనంతమూ.. ఈ రెండు అర్థాలూ అందులోనే వస్తాయి. అందుకే దాన్ని పూర్ణం అన్నారు. మన జీవితంలో చివరికి మిగిలేది కూడా సున్నానే.
ఏ సున్నా అయినా తొమ్మిది అంకెల సపోర్ట్ ఉంటేనే దాని విలువ పెరుగుతుంది. అందుకే సున్నాకు ఎంత విలువ ఉందో తొమ్మిది అంకెలకు కూడా అంతే విలువ ఉంది. ఒకటి అనేది సంఖ్యా శాస్త్రం ప్రకారం సుర్యుడికి సంబంధించింది. ఎనిమిది అనేది శని సంఖ్య. ఒకటి ఆత్మ, ఇంకోటి కర్మ.. ఇవి రెండూ ఒకదాని మీద ఇంకోటి ఆధార పడి ఉంటాయి. ఆ కర్మను బట్టే మనకు జన్మ ఉంటుంది. ఏ కర్మా లేకుంటే జననం లేని జీవితం అంటే మోక్షం లభిస్తుంది. ఆ మోక్షానికి సూచికే ఈ సున్నా కూడా. ఒక్క హిందువులే కాదు బౌద్దులు, క్రైస్తవులు కూడా 108ని పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. దీనికి అంత పవిత్రత ఎందుకు వచ్చిందో చూద్దాం.
108 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారు మన రుషీశ్వరులు. అంటే సత్యం ఒకటే కానీ అనేక రూపాలుగా కనిపిస్తుందన్నది దీని అర్థం. సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం.. ఈ రెండిటి నిర్మాణంలోనూ చాలా పోలిక కనిపిస్తుంది. పోలిక అనటం కన్నా ఒకేలా అనటం బాగుంటుందేమో. విశ్వం, పాలపుంత, గ్రహాలు, నక్షత్రాలు, మనుషులు, కాలం అన్నీ ఒకే పోలికతో సృష్టి జరిగింది. అన్నిటిలోనూ ఒకే విధమైన కూర్పు ఉంది. అందుకే 108 సంఖ్య అందరికీ పవిత్రమైనది. ఎలా అంటే మనకున్న 27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే 108 వస్తుంది. భూమికీ చంద్రుడికీ మధ్య దూరం చంద్రుడి వ్యాసానికి 108 రెట్లు ఉందని మన రుషులు చెప్పారు. అలాగే భూమికీ సూర్యుడికీ మధ్య దూరం సూర్యుడి వ్యాసానికి 108 రెట్లు ఉందని కూడా చెప్పారు.
సూర్యుడి వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు ఉండటం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఆనాడు మన రుషులు చెప్పిన గణననే నేడు మన శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. వెండి అణు బరువు 108గా చెబుతుంటారు. చంద్ర శక్తికి కూడా ఇది సంకేతమే. మన భాషలోనూ 54 అక్షరాలు ఉన్నాయి. అవి స్త్రీ, పురుష శక్తిని సూచిస్తాయి. అలా కలిపినా 108 వస్తుంది. మనకు ఎంతో పవిత్రమైన గంగా నది 12 డిగ్రీల రేఖాంశం, 9 డిగ్రీల అక్షాంశంలో ప్రవహిస్తోంది. 12 × 9 = 108 అవుతుంది. ఇంకా లోపలికి వెళదాం. మన ఉపనిషత్తులు 108, మహాభారతం లాంటి అనేక పవిత్ర గ్రంథాలలో అధ్యాయాలు 108, మహా భారత యుద్ధం 18 రోజుల్లో ముగిసింది.
మనలోకి మన ప్రయాణం
బయటి ప్రపంచాన్ని కాకుండా మన లోపలి ప్రపంచాన్ని కూడా చూసొద్దాం. మనిషి శరీరంలో 108 మర్మ స్థానాలు ఉన్నాయి. మనలోపల 108 ప్రెషర్ పాయింట్లు ఉండటం, మనిషి శ్వాసలకూ 108కీ సంబంధం ఉండటం కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలే. మనిషి నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాడు. అంటే గంటకు 900 సార్లు. 12 గంటలకు 10800 శ్వాసలు వస్తాయి. మనకు 108 డిగ్రీల జ్వరం వచ్చిందనుకోండి మన శరీర అవయవాలన్నీ చచ్చుబడి పోతాయి. తమాషాగానే ఉంది కదూ. మనిషి గుండెలో 108 శక్తి రేఖలు ఉన్నాయట. శ్రీచక్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 108 వస్తుంది.
జ్యోతిష విశ్లేషణ
శిశువు జననం విషయంలో నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. శిశు జనన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రం ఎన్నో పాదంలో ఉంటాడో దాని ప్రభావం మీద అతని జీవితం ఆధారపడి ఉంటుంది. మనకున్న 12 రాశులను 9 గ్రహాలతో హెచ్చించినా 108 వస్తుంది. మనిషి సగటున 21,600 శ్వాసలు తీసుకుంటాడు. ఇందులో 10800 సూర్యాంశ, 10800 చంద్రాంశ ఉంటుంది. ఇక సంఖ్యాశాస్త్రంలో 108లో ఉన్న 18కి యజ అనే పేరు ఉంది. దాన్ని తిరగేస్తే జయ అవుతుంది. ఈ పేరుతోనే మహాభారతాన్ని రాశారు. కాల క్రమేణా జయభారతం కాస్తా మహా భారతంగా మారింది. విష్ణు సహస్ర నామాలు 108, అష్తోత్తరాలలో 108 నామాలతో దేవతలను మనం ఆరాధిస్తుంటాం.
దీనికి కారణం మన మహర్షులు వేల సంవత్సరాల క్రితమే పరిశోధనలో దీని ప్రాధాన్యాన్ని తేల్చారు. 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 x 4 = 108 అవుతుందని ఇందాకే అనుకున్నాం. 108 సార్లు జపం చేయడం వలన మనస్సును నిర్మలం చేస్తుంది. లోపల ఉన్న భావాలను అణగదోక్కుతుంది. సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వాటికి శివ, శక్తి తత్త్వాలైన స్త్రీ, పురుష రూపాలుంటాయి. 54 x 2 =108 12000 దివ్య సంవత్సరాలు = 43,20,000 మానవ సంవత్సరాలు = బ్రహ్మకు ఒక పగలు = 4000 x 108108 లో 1 జీవుడిని తెలియచేస్తుంది. 8 జీవుని తత్త్వాలను తెలియ చేస్తుంది. 0 పరిపూర్ణ భగవత్తత్త్వం.
ఈ శరీరాన్ని జీవుడిని కలిపి నియమించేది పరిపూర్ణ భగవత్తత్త్వము 108. ఈ సంఖ్యను కూడితే 1+0+8 = 9 చాలా ముఖ్యమైన సంఖ్య. 9 తో ఏది కలిపినా వచ్చిన సంఖ్యలో numberలను కలిపితే చివరకు అదే సంఖ్య వస్తుంది. ఈ సృష్టికీ తొమ్మిదికీ అవినాభావ సంబంధం ఉంది. సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తుల్లో బ్రహ్మ ఒకడు. బ్రహ్మ విష్ణువు బొడ్డు నుంచి పుట్టుకొచ్చిన కమలంలో ఆవిర్భవించాడు. అందుకే విష్ణువును కమలనాభుడు, పద్మనాభుడు అని, బ్రహ్మను కమలసంభవుడు అని అంటారు. సృష్టికర్త బ్రహ్మ 432 కోట్ల సంవత్సరాల పాటు సృష్టిని కొనసాగిస్తాడని అంటారు. ఈ కాలాన్ని కల్పం అంటారు.
ఇది బ్రహ్మకు ఒక పగలు. కల్పం ముగిశాక గొప్ప ప్రళయం వచ్చి సృష్టి అంతా నశించిపోతుందట. దాన్ని కల్పాంతం అంటారు. కల్పాంతం 432 కోట్ల సంవత్సరాలపాటు కొనసాగుతుంది. అది బ్రహ్మకు రాత్రి. ఒక కల్పం, కల్పాంతం కలిస్తే బ్రహ్మకు ఒక రోజు. ఇలాంటి రోజులు 360 గడిస్తే అది బ్రహ్మకు ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు వంద గడిస్తే బ్రహ్మకు ఆయుర్ధాయం తీరిపోతుంది. అప్పుడు ఇప్పుడున్న బ్రహ్మ స్థానంలో ఇంకొకరు బ్రహ్మత్వం పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి. వీటి ఆధారంగా హనుమంతుడిని కాబోయే బ్రహ్మగా చెబుతుంటారు. ఇదీ మన సృష్టిరహస్యంలోని గొప్పతనం, 108 సంఖ్యకు ఉన్న ప్రత్యేకత.
– హేమసుందర్ పామర్తి











