(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఇప్పటి వరకూ జాతీయ రహదారులకే పరిమితమైన టోల్ ఫీజు ఇక రాష్ట్ర రహదారుల్లోనూ వసూలు చేయనున్నారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ రద్దీగా ఉన్న 35 రహదారులను గుర్తించింది. ఇందుకు మొదటి విడతగా 11 రహదారులపై టోల్ గేట్లు ఏర్పాటు చేసీ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుగా గుర్తించిన 11 రాష్ట్ర రహదారుల్లో టోల్ ఫీజు వసూలుకు రంగం సిద్దం కానుంది. (ఇదీ చదవండి : ముందే చెప్పిన లియోన్యూస్ .. ఆ కథనం ఇక్కడ చదవండి)
ఇక్కడ నుంచే ప్రారంభం
నరసరావుపేట నుంచి అమరావతి, గుంటూరు – చీరాల, సత్తెనపల్లి – మాదిపాడు, హనుమాన్ జంక్షన్ – విస్సన్నపేట, భీమవరం – ముదినేపల్లి, ఏలూరు – జంగారెడ్డి గూడెం, కడప – పులివెందుల, కడప – పోరుమామిళ్ల, ఒంగోలు – బెస్తవారిపేట, కర్నూలు – దేవనకొండ, చిత్తూరు – పుత్తూరు ముందుగా ఈ మార్గాల్లో టోల్ వసూలు చేసేందుకు టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కడప – బద్వేల్, పోరుమామిళ్ల – తాటిచర్ల, ఒంగోలు – బెస్తవారిపేట మార్గాల్లో రెండేసి చొప్పున టోల్ గేట్లు రానున్నాయి. టెండర్లు ద్వారా అనుమతి పొందిన కాంట్రాక్టర్లు రెండు సంవత్సరాలపాటు టోల్ ఫీజు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి రూ.200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఎంత పిండుతారు?
టోల్ ఫీజులు ఎంత నిర్ణయించాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.30, ఆరు చక్రాల వాహనాలకు రూ.40, పది చక్రాల వాహనాలకు రూ.50, అంతకన్నా భారీ వాహనాలకు రూ.100 వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా వసూలైన మొత్తంతో ఆయా రహదారుల అభివృద్ధి, నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతలో పెట్టిన టోల్ గేట్ల నిర్వహణను పరిశీలించి, రాష్ట్రంలో మరో 30 మార్గాల్లో టోల్ గేట్లు పెట్టి ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రద్దీ ఎక్కువగా ఉండే రూట్ల వివరాలను అధికారులు సేకరించారు.
రోడ్లు అధ్వాన్నం అయినా ఆ పిండుడేంటి
వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్ర రహదారులు నిర్మించినా వాటి నిర్వహణకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో రోడ్లు గుంటలు పడి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. జాతీయ రహదారుల తరహాలో అంటే ఎవరైతే రోడ్డు నిర్మిస్తారో వారికే పది సంవత్సరాల పాటు రోడ్డు నిర్వహణ అప్పగించాలని భావించారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ప్రతిపాదన చేసినా కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదు. అందుకే వైసీపీ ప్రభుత్వం టోల్ గేట్లు పెట్టి, వచ్చిన సొమ్ముతో ఆయా రహదారుల నిర్వహణ చేపట్టాలని యోచిస్తోంది.
రోడ్ల నిర్వహణ అతి పెద్ద భారం
రాష్ట్రంలో రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎడతెరపి లేని వర్షాలకు తోడు, రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల చేయకపోవడంతో రహదారుల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఆయా రోడ్లపై ప్రయాణించే వారు ప్రభుత్వ తీరుపై తీవ్ర పదజాలంతో మండిపడుతున్నారని వైసీపీ పెద్దలకు చేరింది. మరీ ఇంత దారుణమైన రహదారులు ఎప్పుడూ చూడలేదని పలు పార్టీల నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు.
ఇవన్నీ గమనించిన ప్రభుత్వం రహదారుల తక్షణ మరమ్మతులకు రూ.300 కోట్లు విడుదల చేసింది. శాశ్వాత మరమ్మతులు చేయడానికి రూ.2200 కోట్లు అవసరం అవుతాయని ఇంజనీర్లు ప్రతిపాదనలు పెట్టారు. అంత నిధులు ఇచ్చే అవకాశాలు లేవు. అందుకే మీరు వసూలు చేసుకోండి, రోడ్లు నిర్వహించుకోండి, మమ్మల్ని అడగవద్దు అన్నట్టుగా టోల్ గేట్ల ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారని తెలుస్తోంది.











