Ananthagiri Lepakshi Temple :
తరచిచూడాలే కానీ… మన తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కట్టడాలు, మదిని దోచే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా అలనాటి కట్టడాలు నేటికి ఆకట్టుకుంటున్నాయి. గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలంగా ఉండటం విశేషం. తెలంగాణలో రామప్ప, గోల్కొండ, లక్నవరం, వరంగల్ కోట లాంటివి ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో అరుకు గుహలు, అహోబిలం, లేపాక్షి ఆలయం, శ్రీశైలం లాంటి ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. ఈ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు మన దేశస్తులే కాకుండా.. విదేశీయులు సైతం ఇక్కడి ప్రాంతాలను చూసి పరవశించిపోతుంటారు.
త్వరలో లేపాక్షికి గుర్తింపు
తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయానికి రెండు రోజుల క్రితమే యునెస్కో గుర్తింపు లభించింది. రామప్ప తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధ, పురాతన కట్టడాలున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని ప్రముఖ లేపాక్షి ఆలయానికి కూడా యునెస్కో గుర్తింపు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్టు టీజీ వెంకటేశ్ నేతృత్వంలోని పర్యాటకం, సాంస్కృతిక శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం నిన్న పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. అలాగే, రాతియుగానికి చెందిన కేతవరం గుహలను కూడా ప్రపంచ వారసత్వ కేంద్రాల జాబితాలో చేర్చాలని యునెస్కోను కోరనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రూ. 159 కోట్లతో 13 చోట్ల ప్రపంచస్థాయి మ్యూజియంలను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్థాయీ సంఘం తన నివేదికలో తెలిసినట్టు తెలుస్తోంది.
లేపాక్షి విశేషాలివే..
లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణం. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. ఇక్కడికి 200 మీ. దూరంలో మధ్య యుగం నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం ఉంది. ఇక్కడ కూడా దాదాపు ముప్పై అడుగుల ఎత్తువరకు పాము చుట్టుకొని ఉన్నట్లున్న శివలింగం ఆరుబయట ఉంటుంది. చక్కటి శిల్పచాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు మరియు అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ పూజలు జరుగుతున్నాయి. ఈ దేవాలయము పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో సుందరముగా ఉంటుంది. ఈ చారిత్రాక ప్రదేశం బెంగుళూరు నుండి 120 కి.మీ. దూరంలో ఉంటుంది.
Must Read ;- ‘రామప్ప’కు గుర్తింపు.. కిషన్ రెడ్డి ప్రభావమేనా?