(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సింహాచల దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించాలంటే అధికారులు భయపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడ విధుల్లో చేరే అధికారులకు ఎదురవుతున్న ఒత్తిడులు, రాజకీయ పైరవీల కారణంగా ఉద్యోగ బాధ్యతలు కష్టతరంగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు నియామకంతో ఇక్కడ ఈఓలుగా బాధ్యతలు చేపట్టే వారికి స్వేచ్ఛ కరువైంది.
ప్రతి నిర్ణయం లోనూ పాలకమండలి ఆమోదం తీసుకోవాల్సి రావడం, ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ నిర్ణయాల పై అధికారులు తలలు పట్టుకోవాల్సి రావడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలో తనను దేవస్థానం విధుల నుంచి తప్పించండి… అంటూ గతంలో ఇంచార్జి బాధ్యతలు నిర్వహించిన ఈవో డి భ్రమరాంబ ఉన్నత అధికారులకు మొర పెట్టుకోవడంతో ఆమెను బదిలీ చేసి అన్నవరం దేవస్థానం ఈవో వి. త్రినాధరావు కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా ఆయన కూడా తనను బాధ్యతల నుంచి తప్పించాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. కార్తీకమాసంలో అటు అన్నవరం దేవస్థానంలో.. ఇటు సింహాచలం దేవస్థానం పరిధిలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ దేవాలయాల బాధ్యతలు నిర్వహించడం కష్టతరంగా ఉంటుందని ఆయన ఉన్నతాధికారులకు లేఖలో వివరించినట్టు సమాచారం. అయితే దీని వెనుక ఇతరత్రా కారణాలు ఉన్నాయని దేవస్థానం ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు.
గతంలో సింహాచలం దేవస్థానం ఈవోగా పని చేసేందుకు ఎంతో అత్యుత్సాహం చూపేవారు. ఇందుకోసం పైరవీలు చేయించుకుని మరీ దేవస్థానం కి వచ్చేవారు. కానీ వివాదాల కారణంగా ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇన్చార్జిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించినా తమ వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే భూ వివాదాలు, రాజకీయ పైరవీలకు తలొగ్గని అధికారిని నియమించాల్సి ఉంటుంది.
ఏదో జరుగుతోంది?
సింహాచలం దేవస్థానం చైర్పర్సన్గా సంచైత గజపతిరాజు నియమించడం వెనుక భూ వ్యవహారాలు దాగి ఉన్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఎన్నడూ లేని విధంగా ఇంచార్జి ఈవోలు బాధ్యతల నుంచి తప్పించండి అంటూ మొరపెట్టుకోవడం వెనుక ఇటువంటి వ్యవహారాలు దాగి ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పైరవీలకు తలొగ్గి సంతకాలు చేస్తే భవిష్యత్తులో చిక్కులు తప్పవన్న భయంతోనే అధికారు తప్పుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.











