మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద చెల్లెలు విజయదుర్గ కుమారుడే ఈ సాయిధరమ్ తేజ్. వినాయక చవితి రోజున ఇలాంటి ప్రమాదం జరగడం, మెగా కుటుంబంలో విషాదం చోటుచేసుకోవడంతో మెగా అభిమానుల్లో కలకలం రేపింది. స్పోర్ట్స్ బైక్ మీద నుంచి కింద పడటంవల్లే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.
మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సాయిధరమ్ తేజ్ కు తీవ్రంగా గాయాలవడంతో అపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు సాయిధరమ్ తేజ్ ను మాదాపూర్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. స్పృహ నుంచి కోలుకున్నాడని, పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు అంటున్నారు. స్పోర్ట్స్ బైక్ పై రైడింగ్ కు వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.
ప్రాణాపాయం లేదని సమాచారం. అతనికి కుడికన్ను, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు సాయితేజ్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. అతను త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిధరమ్ తమ్ముడే ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్. ఈ ఘటనతో మెగా కుటంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం సాయధరమ్ ను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Must Read ;- పాటతో భీమ్లా నాయక్ తొడగొట్టేశాడు