అమరావతి ఉద్యమాన్ని అవహేళన చేసేలా కొన్ని అరాచక శక్తులు మూడు రాజధానులు కావాలంటూ ఉద్యమం ప్రారంభించాయి. ఈ ఉద్యమానికి మంగళగిరి నుంచి జనాలను ఆటోల్లో రాజధానికి తరలించి రైతుల మధ్య గొడవలు సృష్టించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. మంగళగిరి నుంచి ఒక్కొక్కరికీ రూ.800 కూలీ, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి తరలిస్తున్నారు. వీరి సాయంతో మూడు రాజధానులు కావాలంటూ కొన్ని శక్తులు అమరావతిలో అలజడులకు పథకం పన్నినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు మంగళగిరి నుంచి 15 ఆటోల్లో అమరావతి రాజధానిలోని ఉద్దండరాయునిపాలెం బయలు దేరిన కూలీలను కృష్ణాయపాలెం రైతులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మీకు మూడు రాజధానులు కావాలంటే మంగళగిరిలో లేదా తాడేపల్లిలోని సీఎం నివాసం వద్ద ఉద్యమం చేసుకోవాలని, రాజధాని గ్రామాల్లో మీకు ఏంపనని నిలదీశారు. అమరావతి ఉద్యమంలోకి అరాచకశక్తులను చొప్పించి, రైతుల మధ్య గొడవలు పెట్టి, హింసాత్మకంగా మార్చాలని కొన్ని అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని రైతులు అనుమానిస్తున్నారు.
ఇదెక్కడి చోద్యం
ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అంటూ అమరావతికి 34 వేల ఎకరాల భూమి ఇచ్చిన 29 గ్రామాల రైతులు 311 రోజులుగా శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నారు. అమరావతిని సాధించుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. రైతులు ఉద్యమాన్ని ఇప్పట్లో ఆపేలా లేరని గ్రహించిన అధికార పార్టీ పెద్దలు, ఉద్యమాన్ని ఎలాగైనా హింసాత్మకంగా మార్చి పోలీసులతో అణిచివేయాలని చూస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. అందుకే ఇలాంటి చవకబారు ఉద్యమాలకు తెరలేపారని సమాచారం.
కరోనా టీకా వస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఉద్యమం
కరోనా వైరస్ ప్రభావంతో అమరావతి ఉద్యమానికి పెద్ద దెబ్బే పడింది. అమరావతి ఉద్యమం రాష్ట్రం మొత్తం విస్తరించే సమయంలో కరోనా రావడంతో ధర్నాలు, రాస్తారోకోలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ గుమిగూడటానికి అవకాశం లేకుండా పోయింది. కరోనా పేరుతో అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కొంత వరకు ఫలించాయి. అయితే మరో రెండు, మూడు మాసాల్లో కరోనా టీకా వస్తే, ఇక ఎవరూ అమరావతి ఉద్యమాన్ని ఆపలేరు. అందుకే అధికారపార్టీ నేతలు కుట్రతో ఈ లోపుగానే అమరావతిలో ఉద్యమం లేకుండా చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి రాష్ట్రం మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంచడం ద్వారా అమరావతి ఉద్యమం అన్ని జిల్లాలకు పాకకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే కొందరు కూలీలను మూడు రాజధానుల పేరుతో ఉద్యమంలో దించుతున్నరని తెలుస్తోంది.
ఉద్యమంలో రౌడీషీటర్లు..
అమరావతిలో కొన్ని దుష్టశక్తులు మూడు రాజధానుల ఉద్యమానికి అన్ని విధాలా సాయం చేస్తూ ఆజ్యం పోస్తున్నాయని తెలుస్తోంది. అందుకే మంగళగిరి నుంచి కొందరు రౌడీషీటర్లను కూడా ఇవాళ మూడు రాజధానుల ఉద్యమంలోకి పంపిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. అమరావతి ఉద్యమం హింసాత్మకంగా మారితే నూరు శాతం అధికారపార్టీ నేతలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏ ఉద్యమం అయినా హింసాత్మకంగా మారనంత వరకే, ఒక్క సారి ఉద్యమంలో హింస చోటు చేసుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని గ్రహిస్తే అందరికీ మంచిది.











