( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సింహాచల దేవస్థానం భూ సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారని అధికారపార్టీ మంత్రులను, నాయకులను ప్రశ్నిస్తే… ముందుగా వచ్చే సమాధానం “ అంశం కోర్టు పరిధిలో ఉంది. వీలైనంత త్వరగా కోర్టు ద్వారా పరిష్కరిస్తాం ” ..ఇదే సమాధానం ఏళ్ళతరబడి చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వం భూ సమస్య పరిష్కారానికి ఏమి చేయడం లేదని ప్రజలు భావించకుండా ఉండేందుకు రెండున్నర గంటల సినిమాకి ముందు వేసే అడ్వర్టైజ్మెంట్ లాగా కమిటీ సభ్యులు కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకుంటున్నారు. “ త్వరలోనే భూ సమస్య కు పరిష్కారం…” మరుసటి రోజు పత్రికల్లో వచ్చే హెడ్డింగ్ ఇది. దశాబ్దాలుగా పరిష్కారానికి ఎదురు చూస్తున్న పంచ గ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం కోర్టు నుంచి మాత్రమే లభించాల్సి ఉంది. ఎవరు అవునన్నా .. కాదన్నా.. ఇదే వాస్తవం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ఏడాది ఆరుగురు సభ్యులతో వేసిన కమిటీలో మరో ముగ్గురికి చోటు కల్పిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, అనకాపల్లి ఎంపీ బి. వెంకట సత్యవతి, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ను కమిటీలో చేర్చింది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే ఏ . అదీప్ రాజ్, జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ అడ్వైజర్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఒకటి రెండు దఫాలు సమావేశమైంది. అదేవిధంగా శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కూడా చర్చించింది. తాజాగా అదే కమిటీలో మరో ముగ్గురికి చోటు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది.
ఎన్నో అనుమానాలు..
సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ గ్రామాలకు గాని, భూ సమస్య ఉన్న నియోజకవర్గాలకు గాని, ప్రధానంగా విశాఖ జిల్లాకు సంబంధం లేని విజయసాయిరెడ్డిని ఈ కమిటీలో సభ్యుడిగా చేర్చటం వెనుక ఆంతర్యం అంతుచిక్కడం లేదు. పార్టీ పరంగా ఆయనకు జిల్లా బాధ్యతలు ఉండవచ్చునేమో కానీ, పంచ గ్రామాల భూ సమస్యతో ఆయనకు ఎటువంటి ఉద్యమ నేపథ్యం లేదు. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎందరో భూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో పాల్గొన్నవారే. వారెవరికీ దక్కని చోటు వీరికి ఇవ్వడం వెనుక వాస్తవాలు నేడు కాకుంటే రేపైనా వెల్లడి కాకుండాపోవు. సింహాచలం దేవస్థానం భూముల కోసం ప్రభుత్వ పెద్దలు గాని, పార్టీ నాయకులు గానీ తీసుకోకూడని నిర్ణయాలు కనుక తీసుకుంటే మరో ఉద్యమానికి వారే నాంది పలికినట్టు అవుతుంది.
పాపం ఎంవివి..
జిల్లాకు సంబంధం లేని వ్యక్తులకు స్థానం కల్పించి, జిల్లా ఎంపీ ని పక్కన పెట్టడం వెనుక కారణాలు తెలియరావడం లేదు. పొరుగునే ఉన్న అనకాపల్లి ఎంపీకి కమిటీలో స్థానం కల్పించి.. ఎం వి వి సత్యనారాయణకు చోటు దక్కకపోవడం హాట్ టాపిక్ గా మారింది.











