గుంటూరు జిల్లా బెల్లంకొండ మండల వైసీపీలో రెండు వర్గాల మధ్య అసంతృప్తి సెగలు కిడ్నాప్ కు దారితీశాయి. పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డిని ప్రత్యర్థులు ఇవాళ హైదరాబాద్ సమీపంలో కిడ్నాప్ చేశారు. బెల్లంకొండ వైసీపీలో మాజీ ఎంపీపీ, వైసీసీ జెడ్సీటీసీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో బెల్లంకొండ వైసీపీ అభ్యర్థి హైదరాబాద్ లో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని బయలుదేశారు. అయితే అనూహ్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హైదరాబాద్ సమీపంలో వెంకటరెడ్డిని కిడ్నాప్ చేసినట్టు బందువులు తెలిపారు.
ప్రత్యర్థుల పనే..
బెల్లంకొండ వైసీపీ జడ్సీటీసీ అభ్యర్థి గాదె వెంకటరెడ్డి టీడీపీలో చేరడం ఇష్టం లేని వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. గాదె వెంకటరెడ్డి గతంలో బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామానికి ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పనిచేశారు. తాజాగా బెల్లంకొండ మండల వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఈ మధ్య కాలంలో మండల వైసీపీలో మాజీ ఎంపీపీతో ఏర్పడిన వివాదాలు పార్టీలో అసంతృప్తి సెగలు రేపాయి. వైసీపీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదంటూ స్థానిక నేతలను తీసుకుని టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ కొమ్మాలపాటి శ్రీధర్ హైదరాబాద్ లో ఉండటంతో ఆయన సమక్షంలో టీడీపీలో చేరేందుకు బయలు దేరారు. అయితే ఇవాళ గాదె వెంకటరెడ్డి, మరో ఇద్దరు అనుచరుల ఫోన్లు పనిచేయకపోవడంతో వారు కిడ్నాప్ కు గురై ఉంటారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల హచ్ చల్
గాదె వెంకటరెడ్డిని టీడీపీలోకి తీసుకోవద్దంటూ, బెల్లంకొండ తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిపించి పోలీసులు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. బెల్లంకొండ టీడీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి, పెదకూరపాడు టీడీపీ ఇంఛార్జి కొమ్మాలపాటి శ్రీధర్తో వెంకటరెడ్డిని టీడీపీలోకి తీసుకోవద్దంటూ పోలీసులు ఒత్తిడి తీసుకురావడంపై ప్రతిపక్షనేతలు విమర్శలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు.