వైసీపీలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి జోగి రమేశ్… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొంప ముంచేశారు. వైసీపీలో కీలక నేతగా ఎదిగిన ఆయన టీడీపీ నేతలతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. సోమవారం నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ ఇందుకు వేదికగా నిలిచింది.ఈ కార్యక్రమంలో మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీని వదిలి టీడీపీలో చేరి… ఇప్పుడు కూటమి కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్న కొలుసు పార్థసారథి, టీడీపీ కీలక నేత, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి జోగి రమేశ్ పాల్గొన్నారు.
ఇందులో భాగంగా పట్టణంలో ర్యాలీ జరగగా… సదరు ర్యాలీలో ఓ జీపుపై పార్థసారథి, శిరీష ఎక్కగా… వారి పక్కనే రమేశ్ కూడా ఆ జీపు ఎక్కారు. ఓపెన్ టాప్ జీపులో ఇద్దరు కీలక టీడీపీ నేతలతో కలిసి రమేశ్ ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అంతేకాకుండా వైసీపీకి చెందిన రమేశ్ ను అసలు జీపు ఎలా ఎక్కనిచ్చారంటూ పార్థసారథి, శిరీషలపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చెప్పినట్టుగా నడుచుకున్న జోగి రమేశ్ టీడీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. ఒకానొక సందర్భంలో జగన్ దృష్టిలో పడి మంచి మార్కులు కొట్టేసేందుకు ఏకంగా నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటిపైకి రమేశ్ దాడికి యత్నించార. ఆ తర్వాత ఆయన అనుకున్నట్లుగానే… జగన్ కేబినెట్ లో జోగికి మంత్రి పదవి దక్కింది. అనుకున్నట్లుగానే మంత్రి పదవి దక్కడంతో రమేశ్ చక్రం తిప్పారు. ఇష్జారాజ్యంగా వ్యవహరించిన రమేశ్ కుటుంబం… అధికారులను అడ్డం పెట్టుకుని భారీ దందాలు చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ కారణంగా వైసీపీ అధికారం కోల్పోగానే… రమేశ్ పై కేసులు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలో ఆయన కుమారుడు అరెస్ట్ కూడా అయ్యారు. వెరసి ఆత్మరక్షణలో పడిపోయిన జోగి… వైసీపీని వీడితే తప్పించి ఈ సమస్యల నుంచి బయటపడలేనని గ్రహించారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ఆయన తన అనుచరులతోనే ప్రచారం చేయించారు. అయితే అటు టీడీపీ నుంచి గానీ, ఇటు జనసేన ,నుంచి గానీ ఆయనకు ఎంట్రీ దొరికే అవకాశమే కనిపించడం లేదు. గతంలో వైసీపీలో కొనసాగిన పార్థసారథి ప్రస్తుతం టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కారణంగా ఆయన ద్వారా జోగి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే టీడీపీ కార్యక్రమంలో ఆయన పాలుపంచుకన్నారని సమాచారం.
బీసీ సాామాజిక వర్గానికి చెందిన జోగి రమేశ్ కు జగన్ అత్యథిక ప్రాధాన్యిచ్చారు. అడిగిన వెంటనే పోటీ చేసేందుకు ఎమ్మెల్యే సీటును ఇస్తూ వచ్చిన జగన్… జోగి కోరినట్టుగానే ఆయనకు తన కేబినెట్ లో మంత్రిి పదవినీ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పార్టీ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేలా అవకాశం కూడా ఇచ్చారు. అంతేకాకుండా వైసీపీ తీసుకున్న పలు కీలక నిర్ణయాల్లో జోగికి కూడా పాత్ర ఉండేలా జగన్ చూసుకున్నారు. పార్టీ రహస్యాలు కూడా జోగి వద్ద జగన్ పెద్దగా దాచిన సందర్భం కూడా లేదనే చెప్పాలి.
ఈ లెక్కన జోగి… జగన్ కు నమ్మినబంటు కిందే లెక్క. మొన్నటి ఎన్నికల్లో జోగి ఓడిపోతే… తన నియోజకర్గాన్ని మార్చాలంటూ జోగి కోరడమే ఆలస్యం… ఆయనను మైలవరం ఇంచార్జీగా నియమించారు. అయితే ఇప్పటిదాకా జోగి మైలవరంలో అడుగుపెట్టిన పాపానే పోలేదని సమాచారం. కేసుల నుంచి తనను, తన ఫ్యామిలీని కాపాడుకోవడమే అంతిమ లక్ష్యంగా సాగుతున్న జోగి… జగన్ కు జల్ల కొట్టి టీడీపీ పంచన చేరేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వైసీపీ శ్రేణులే బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.











