( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
“ వంగవీటి హత్యకేసులో కాకుంటే ఏదో ఒక కేసులో నువ్వు దొరకక తప్పదు”… అని బహిరంగంగా రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుని ఉద్దేశించి హెచ్చరించారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయసాయిరెడ్డి అన్నిరకాల అస్త్రశస్త్రాలను ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. కులాన్ని వాడుకుంటున్నారు, గతంలో ఉన్న కేసులన్నీ ప్రస్తావిస్తున్నారు, మరో అడుగు ముందుకేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామకృష్ణ బాబు తొలిసారిగా ఎమ్మెల్యే అయినట్టు… విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రచారం చూసి స్థానిక ఓటర్లు విస్తుపోతున్నారు.
‘‘నాయకులు కావాలా? హంతకులు కావాలా?”
“మీరు వెలగపూడికి భయపడాల్సిన అవసరం లేదు. వెలగపూడి ఒక హంతకుడు. వంగవీటి రంగ హత్య కేసులో ఐదో నిందితుడు. ఏదో సాక్ష్యాధారాలు తారుమారు చేసి ఆ కేసు నుంచి బయటపడ్డ వ్యక్తి. ప్రత్యక్షంగా వంగవీటి రంగాను హత్య చేసిన వ్యక్తి రామకృష్ణ బాబు. అటువంటి వ్యక్తిని మీరంతా శాసనసభ్యుడిగా ఎన్నుకుంటున్నారు. దానివల్ల నష్టపోయేది మీరే. 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగే వైఎస్ఆర్సిపి నాయకులు కావాలా? హంతకులు కావాలా?” అంటూ కార్పొరేషన్ ఎన్నికలకు, 2024 లో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికలకు ఒకేసారి పనిలో పనిగా ప్రచారం చేశారు. ఎప్పుడూ టిడిపి అధినేత చంద్రబాబు పై విరుచుకు పడే విజయసాయిరెడ్డి… విశాఖలో మాత్రం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పై ఇష్టానుసారం ఆరోపణలు చేశారు. కోర్టు తీర్పులను అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యాయవ్యవస్థపై చేస్తున్న దాడి గురించి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదే పందాలో దశాబ్దాల క్రితం నాటి తీర్పులను ఉదహరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అక్కడెక్కడో హత్యచేసి విశాఖలో తలదాచుకునేందుకు వచ్చారని, అటువంటి రౌడీల ఆట కట్టిస్తామని హెచ్చరికలు చేశారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

కాపు సోదరులను రెచ్చగొట్టే ప్రయత్నం..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ విజయసాయిరెడ్డి కులం కార్డును వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాపు సోదరులపై ప్రేమ పుట్టుకొచ్చినట్టు ప్రసంగాలు దంచేస్తున్నారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహన రంగాను హత్య చేసిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తికి కాపు సోదరులు ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు. కాపు సోదరులు అంతా ఒక్క సారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెలగపూడి చుట్టూ చాలామంది రౌడీషీటర్లు ఉన్నారని ఆరోపించారు. విజయవాడ రౌడీ రాజకీయాలను విశాఖలో చేస్తే కుదరదని హెచ్చరించారు. ఎటువంటి బెదిరింపులు వచ్చినా తనకు సమాచారం ఇస్తే తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.
వీళ్లంతా ఎక్కడ నుంచి వచ్చారో..?
మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి కొత్తగా వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లు అనూహ్యంగా, రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గెలుచుకున్న వైఎస్ఆర్సిపి.. విశాఖ తూర్పులో మాత్రం వెలగపూడి రామకృష్ణ బాబుని డీ కొట్టలేకపోయింది. అటువంటి ఎమ్మెల్యే పై అనేక ఆరోపణలు చేస్తూ, కార్పొరేటర్ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తూ రాజకీయ అవగాహన లేమిని ప్రదర్శించారు. సాటి కార్పొరేటర్ అభ్యర్థితో సరిపోల్చుతూ ఓట్లు అడగాల్సిన ఎంపీ…. వెలగపూడి టార్గెట్గా ప్రచారం చేయడం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. 2019 ఎన్నికల్లో సమీప వైఎస్ఆర్సిపి అభ్యర్థిపై వెలగపూడి రామకృష్ణబాబు సుమారు 27 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. అదే 2014 ఎన్నికల విషయానికి వస్తే.. వైయస్సార్ సిపి ప్రత్యర్థిపై 52, 741 మెజారిటీ సాధించారు. అటువంటి వ్యక్తి అరాచకాలు, రౌడీయిజం అంటూ అదే నియోజకవర్గం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రుబాబు చేస్తున్నారని చెప్పుకొచ్చారు మరి.. మీరంతా ఎక్కడ నుంచి వచ్చారు మహానుభావా! అంటూ స్థానికులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు.
ఆర్థిక నేరం కన్నా పెద్దగా?
అనేక ఆర్ధిక నేరాలలో ఎ 2 గా వున్న ఎంపీ విజయసాయిరెడ్డి నీతులు చెప్పడం ఏంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో తిరుగుతున్న అధికార పార్టీ నాయకులంతా విశాఖలో పుట్టి పెరిగారా? మీరు ఇక్కడ సెటిల్ కావచ్చా అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. విశాఖ రాజకీయాల్లో స్థానికేతరులకే అనేకమార్లు పట్టం కట్టిన విషయాన్ని విశాఖ వాసులు గుర్తు చేస్తున్నారు. తమకు స్థానికత ముఖ్యం కాదని.. రాజకీయ పార్టీ.. అభ్యర్థి క్యారెక్టరే ముఖ్యమని… వ్యక్తిగత విషయాల కన్నా.. సేవ చేసే గుణానికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఎన్నో నీతి వ్యాఖ్యలు చేస్తున్న వ్యక్తి మీద ఉన్న కేసుల కన్నా ప్రమాదకరమైన కేసులు విశాఖలో మరి ఎవరిపైనా లేవని పేర్కొంటున్నారు.











