ఏపీకి వైసీపీ గ్రహణం పట్టింది..! వ్యవస్థలన్నీ విధ్వంసం..!!
పంటలకు చీడ, ఏపీకి జగరోన వైరస్ .. రెండు ప్రమాదకమేనని ప్రస్తుతం సోషల్ మీడియా ఈ రోజు ట్రెండింగ్ ఇష్యూ! ఈ నేపధ్యంలో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు తెలుగు దేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. 175 నియోజకవర్గాలలోని శ్రేణులను యాక్టివేట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం మంగళగిరి కేంద్రంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ ఇంఛార్జులు, పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వేదికగా చంద్రబాబు జగన్ పాలన వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించేందుకు బయటకు వస్తుంటే అక్రమంగా అరెస్ట్ లు చేసి కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో బూతులు తప్ప ఏమీ లేవని, న్యాయ వ్యవపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని ఆరోపించారు.
వ్యక్తిత్వం.. విశ్వసనీయత రెండు లేవు..!
జగన్ రెడ్డికి వ్యక్తిత్వం, విశ్వసనీయత రెండు లేవని, ప్రజలు మరిచిపోయినా చరిత్ర ఆయనను క్షమించదని చంద్రబాబు అన్నారు. ఇలాంటి మూర్ఖపు సీఎంని తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. రాష్ట్ర విభజన మిగిల్చిన నష్టం కన్నా.. జగన్ రెడ్డి పాలన ద్వారా రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ ఎక్కువన్నారు. ఒక్క పెట్టుబడి రాకపోగా.. పాలనలో అప్పులు రూ. 7 లక్షల కోట్లకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లు, చెత్తపన్ను, ఆరోగ్యం, విద్యా రంగం వంటివాటిపై జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన ధ్వజమెత్తారు. మార్చి 29 నాటికి తెలుగు దేశం పార్టీ అవిర్భవించి 40 ఏళ్లు అవుతుందని చెప్పారు. ఎన్టీఆర్ వందేళ్ల జయంతి ఉత్సవాల్ని చేసుకోబోతున్నామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిపాలన అందించిన ఘనత టీడీపీదేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజల్ని పోరాటాలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని.. అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు క్రియాశీలక రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు.











