తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అన్న మీద కోపం ఉంటే అక్కడ రాజకీయ పార్టీ పెట్టుకోవాలే కానీ… తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టుకున్నారంటూ షర్మిలను ప్రశ్నించారు. అసలు తెలంగాణతో షర్మిలకు ఏం సంబంధమని అడిగిన ఆయన, ఆమె తండ్రి వైఎస్సార్ తెలంగాణకు బద్ధ వ్యతిరేకి అని చెప్పారు. కాగా , కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల ట్విటర్ వేదికగా కేటీఆర్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
తాము పార్టీ పెట్టడానికి కారణం కేటీఆర్ అయ్య కేసీఆర్ అని.. రైతుల ఆత్మహత్యలు చూడలేక, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేక, రీడిజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడం చూడలేకే తెలంగాణలో పార్టీ పెట్టాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్, కేసీఆర్ లాఠీ దెబ్బలు తిన్నారా? అని షర్మిల ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీజేపీతో డ్యూయెట్లు పాడింది మీరు అని ఎద్దేవా చేసిన షర్మిల. ఇక్కడ ఉన్నది వైఎస్సార్ బిడ్డ అని… సింహం సింగిల్ గానే వస్తుందని చెప్పారు. తమకు వైఎస్సార్ బొమ్మ ఉందని, వైఎస్సార్ అనే పేరు ఉందని.. వైఎస్సార్ సంక్షేమ పాలనే తమ ఆస్తి అని చెప్పారు. ముమ్మాటికీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఓట్లను చీలుస్తామని అన్నారు. పేదవాడికి వైఎస్సార్ సంక్షేమ పాలనను అందిస్తామని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు.