కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తుంది. అయితే ఈ కరోనాకి ముగింపు ఎప్పుడు? ఇంకా ఎంతకాలం? అని జనాలు ఎదురు చూస్తున్నారు. కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ వచ్చేదెప్పుడని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మూతికి మాస్కులు కట్టుకొని భయం భయంగా ఇంకా ఎంతకాలం బతకాలని జనం ఆందోళన చెందుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో రెండు రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో రోజుకి రెండువేలకు పైగా కేసులు నమోదైతే ప్రస్తుతం రెండు వేల లోపే కేసులు నమోదవుతుండటం గమనార్హం. వైద్యారోగ్యశాఖ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ చివరి కల్లా అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టనున్నాయనని తెలిపింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల వివరాలు చూస్తే ఆ అంచనాల ప్రకారమే ఉన్నాయని పేర్కొంటుంది. అలాగే జిహెచ్ఎంసి పరిధిలోనూ ఆగస్టు చివరి నాటికి కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నాయని పేర్కొన్నది.
తక్కువగా పాజిటివ్ రేట్..
రాష్ట్ర వ్యాప్తంగా 1200 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 50 వేలకుపైగా నిత్యం అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగస్టు నెలతో పోల్చుకుంటే కరోనా పాజిటివ్ రేట్ తక్కువగా నమోదైంది. ఆగస్టులో 7 శాతం పాజిటివ్ రేట్ నమోదైతే, సెప్టంబర్ నెలలో 5 శాతానికి పడిపోయింది. అలాగే రికవరీ రేటు 84 శాతం తెలంగాణలో ఉండగా దేశంలో 83 శాతంగా ఉంది. బీహార్, ఒడిశా, కేరళ మాత్రమే మనకంటే ఎక్కువ రికవరీ రేటు ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ రికవరీ రేటు తెలంగాణలోనే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
కరోనా సోకిన వారిలో..
మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 29477. కరోనా సోకిన వారిలో 61శాతం మంది మగవారు ఉంటే 39 శాతం ఆడవారు కరోనాకు గురవుతున్నారు. 45 శాతం ఎలాంటి ఇతర జబ్బులు లేని వారు, 55 శాతం మంది ఇతర జబ్బులతో ఉన్న వారు ఇప్పటివరకు చనిపోయారు. మహబూబాబాద్, భూపాలపల్లి, వరంగల్ అర్బన్, నల్లగొండ జిల్లాలో కేసులు ప్రస్తుతం ఎక్కువగా ఉన్నాయి. మరో వారం పది రోజుల్లో అక్కడ కూడా తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మునుపటి రోజులొచ్చేనా..
అధికారులు చెప్తున్నదాని ప్రకారం త్వరలోనే కరోనాకు ముందులా మంచి రోజులు రానున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు, షికార్లు, షాపింగ్లు, పెళ్లిళ్లు, పండగలు పబ్బాలు, ఫంక్షన్లకు వెళ్లకుండా జనాలు కరోనా కారణంగా ఇళ్లకే పరిమితవుతున్నారు. విద్యావ్యవస్థకు బ్రేక్ పడింది. తప్పని పరిస్థితుల్లో తప్పితే ఇంటి నుంచి ఎవ్వరూ కాళ్లు బయటపెట్టడంలేదు. ఇలాంటి తరుణంలో హైదరాబాద్లో ఆగస్టు చివరికి, జిల్లాల్లో సెప్టెంబర్ చివరి నాటికల్లా కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుందని వైద్యారోగ్య శాఖ ప్రకటించడం రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని కలిగించే విషయమని చెప్పాలి. అధికారులు చెప్పిన దాని ప్రకారం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుందో లేదో చూడాలి మరీ.