మనిషికీ, దేవుడికీ మధ్య ఎంతో కాలంగా ఓ ప్రశ్న తిరుగుతోంది. మనిషుల్ని దేవుడు సృష్టించాడా? దేవుడిని మనిషి సృష్టించాడా? రెండింటికీ ఓటేసే జనాలు కూడాఉన్నారు. ఇదే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమే అమ్మోరు తల్లి. తమిళ వ్యాఖ్యాత, నటుడు ఆర్జే బాలాజీ నటించి దర్శకత్వం వహించిన ‘మూకుతి అమ్మాన్ ’ సినిమా ఎలా ఉండబోతోందన్న ప్రశ్న కూడా ఇంకో పక్క ఉంది. ఎందుకంటే బాలాజీలో వ్యంగ్యం పాళ్లు ఎక్కువ. అందువల్ల ఇది ఓ కామెడీ సినిమా అని కూడా జనం అనుకునే అవకాశం ఉంది.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానం సినిమా చూస్తేనే తెలుస్తుందేమో. పైగా ఇందులో అమ్మోరు తల్లి పాత్రను లేడీ సూపర్ స్టార్ నయనతార పోషించింది. మరోసారి ఆమె తన సత్తాను ఈ దీపావళికి నిరూపించుకోబోతోంది. తమిళంలో ‘మూకుతి అమ్మన్’ పేరుతో తెరకెక్కిన చిత్రాన్ని తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా అనువదించిన సంగతి తెలిసిందే. ఈ దీపావళికి అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అమ్మోరు తల్లి సందడి చేయబోతోంది. ఇందులో ఆమెతో పాటు ఆర్జే బాలాజీ కూడా నటించాడు.
వీరిద్దరి కాంబినేషన్ ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు నానూమ్ రౌడీ థన్, వేలైక్కరన్ లాంటి చిత్రాల్లో నటించిన వారే. వీరి గెటప్పులు చూస్తుంటే ఇదేదో సోషియో ఫాంటసీ సినిమా లాగానే ఉంది. విశేషమేమిటంటే ఆర్జే బాలాజీ ఇందులో నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ బాధ్యతలను కూడా పంచుకున్నారు. అక్కడితో ఆగితే ఫర్వాలేదు. దర్శకత్వం కూడా వహిస్తానని అన్నాడట. అందుకే ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు. ఎన్.జె. శరవణన్ తోపాటు బాలాజీ కూడా దీనికి దర్శకత్వం వహించారు.
హిట్ అయితే బాలాజీ మరీ బిజీ అయిపోతాడేమో. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇది భావోద్వేగాలు ఎక్కువగా ఉండే కుటుంబ కథా చిత్రమని ఆర్జే బాలాజీ అంటున్నారు. ఇందులో ఓ దొంగ బాబా కూడా ఉంటాడు. ఆ పాత్రను అజయ్ ఘోష్ పోషించాడు. ఆర్జే బాలాజీలో బహుముఖ ప్రతిభ ఉంది. ఆర్జే అంటేనే రేడియో జాకీ అని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. 2018 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తమిళ క్రికెట్ వ్యాఖ్యాతగా అతను మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. ఈ సినిమాని అతను హిందీ బ్లాక్ బస్టర్ ‘పీకే’ తో పోలుస్తున్నాడు.
అతనికి పీకే బాగా నచ్చేసిందట. ఆ సినిమా తమిళ రీమేక్ హక్కులను కొనాలని అనుకున్నాడట. దాన్ని రీమేక్ చేస్తే బడ్జెట్ తడిసిమోపెడవుతుందని అనిపించింది. అందుకే మనం సృష్టించిన దేవుడినీ, మనల్ని సృష్టించిన దేవుడినీ దృష్టిలో ఉంచుకుని ఈ కథను రాసుకున్నాడట. తెలుగు, తమిళ భాషల్లో అమ్మోరు ప్రధాన పాత్రగా అనేక సినిమాలు వచ్చాయి. కాబట్టి కొత్త ఏదైనా చెప్పాలన్న తపనతోనే పనిచేశాడంటున్నాడు బాలాజీ. సాధారణంగా అందరూ అనుకుంటుంటారు
‘దేవుడు మన ముందు ప్రత్యక్షమైతే ఏం అడుగుతాం.. నేనైతే ఏం కోరుకుంటాను?’ అన్న పాయింటుతోనే ఈ సినిమాని రూపొందించారు. మనిషి జీవితంలోకి దేవుడు వచ్చిన అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఉంటుందని అనుకోవచ్చు. దురదృష్టం వెంటాడుతున్న ఓ వ్యక్తికి అమ్మోరు తల్లి ప్రత్యక్షమై ఏం వరాలిచ్చిందో ఇందులో ఉంటుందట. ఈ సినిమాకి ‘అవల్’ ఫేమ్ గ్రిష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూర్చారు. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీని అందించారు. నవంబర్ 14న డిస్నీ + హాట్స్టార్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనుంది.