KTR Viral Comments On Huzurabad Bypoll :
ఇప్పుడు ఎక్కడ చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించిన చర్చే నడుస్తోంది. కేసీఆర్ సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా.. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోణంలోనే తీసుకుంటోందన్న చర్చ జరుగుతోంది. ఈ చర్చ నిజమేనన్నట్లుగా ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ ఎంతగా హైరానా పడుతుందో చాలా స్పష్టంగానే తెలిసిపోతోంది. దళిత బంధు అయినా, త్వరలో ప్రారంభం కానున్న గీత కార్మికులకు మోపెడ్ల పథకమైనా.. హుజూరాబాద్ బైపోల్ లో టీఆర్ఎస్ గెలుపు కోసమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ భేటీ తర్వాత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో అసలు హుజూరాబాద్ బైపోల్ చర్చకే రాలేదని, అది తమకు చాలా చిన్న విషయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు టీఆర్ఎస్ లోని భయాన్ని మరోమారు బయటపెట్టాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బైపోల్ పై చర్చ లేకుంటే ఎలా?
మంత్రివర్గం నుంచి కేసీఆర్ బహిష్కరిస్తే.. ఈటల రాజేందర్ ఏకంగా టీఆర్ఎస్ తో పాటు ఆ పార్టీ నుంచి దక్కిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేసి గులాబీ దళానికి సవాల్ విసిరారనే చెప్పాలి. ఆ తర్వాత ఆయన నేరుగా బీజేపీలో చేరిపోతే.. ఉప ఎన్నిక అనివార్యమైన హుజూరాబాద్ లో ఈటలను ఎలా ఓడించాలన్న దానిపై కేసీఆర్ తనదైన శైలి మంత్రాంగం రచిస్తున్నారు. ఇందులో భాగంగా సమావేశం ఏదైనా.. కొత్తగా వచ్చే పథకం ఏదైనా.. కొత్తగా ఇచ్చే పదవి ఏదైనా.. ముందుగా హుజూరాబాద్ కే దక్కిపోతోంది. ఇక ఏ సమాశమైనా కూడా హుజూరాబాద్ చర్చ లేకుండా ముగియట్లేదు. నేతల హోదాతో పనిలేకుండా హుజూరాబాద్ నుంచి వచ్చిన వారికి వెనువెంటనే అపాయింట్ మెంట్లు, అడిగినవన్నీ ఇచ్చేయడం జరిగిపోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించి కీలక సమావేశమైన రాష్ట్ర కార్యవర్గ భేటీలో హుజూరాబాద్ అంశం చర్చకు రాలేదని చెబితే నమ్మేదెలా? అన్న కోణంలో ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. అసలు హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపు వ్యూహ రచనకే ఈ భేటీని నిర్వహించినట్లుగా చెబుతుంటే.. అసలు భేటీలో ఈ అంశమే ప్రస్తావనకు రాలేదని కేటీఆర్ చెబితే నమ్మేదెలా? అన్న మాటలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- అప్పటిదాకా సారు స్పీడు తగ్గదబ్బా