హుజూరాబాద్ ఉప ఎన్నిక.. అధికార టీఆర్ఎస్ సర్కారుకు ముందు నుయ్యి, వెనుక గొయ్య అన్న చందంగా మారిందన్న వాదనలు పెరుగుతున్నాయి. దళిత బంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించాలని భావించిన కేసీఆర్ సర్కారు.. ఆ పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఈ పథకాన్ని ప్రారంభించాలని భావించినా.. తొలుత వాసాలమర్రిలో ప్రారంభించేశారు. ఇక తాజాగా హుజూరాబాద్ లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్ సర్కారు.. ఈ నెల 16న హుజూరాబాద్ లోనే భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభను ఇటు దళిత బంధు పథకం ప్రారంభోత్సవానికే కాకుండా హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఉపయోగపడేలా వ్యూహం రచించారు.అయితే అనూహ్యంగా దళిత బంధు పథకం అమలుపై స్వయంగా దళితులే నిరసన ప్రదర్శనలకు దిగడం సంచలనం రేకెత్తిస్తోంది.
హుజూరాబాద్ లో బంధు ఎందరికంటే?
హుజూరాబాద్ పరిధిలోని దళిత కుటుంబాలు చాలానే ఉన్నా.. తొలుత ఈ పథకం కోసం 21 వేల కుటుంబాలను ఎంపిక చేశారు. ఆ 21 వేల కుటుంబాల్లో తొలుత 5 వేల కుటుంబాలకు పథకాన్ని వర్తింపజేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. అయితే హుజూరాబాద్ లో ఈ నెల 16న నిర్వహించనున్న సభలో మాత్రం కేవలం 15 మందికి పథకం చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు దీనిపై సీఎస్ సోమేశ్ కుమార్ తో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ లు సమావేశమై చర్చించారు. పనిలో పనిగా హుజూరాబాద్ లో నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపైనా ఈ సమావేశంలో చర్చించారు. హైదరాబాద్ లో ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే.. అక్కడ హుజూరాబాద్ లో పెను కలకలమే రేగింది. అది కూడా దళిత బంధు అమలును నిరసిస్తూ ఏకంగా దళితులే నిరసనలకు దిగారన్న వార్తలు ప్రభుత్వ వర్గాలతో పాటు కేసీఆర్ అధిష్ఠానంలోనూ పెను కలకలం రేగింది.
ర్యాలీలు.. ఉద్రిక్తత
దళిత బంధును కొందరికే ఎలా అమలు చేస్తారన్న వాదనను రేకెత్తించిన దళిత సంఘాలు.. హుజూరాబాద్ లో శనివారం నాడు భారీ నిరసనలకు తెర తీశారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం వరంగల్-కరీంనగర్ రహదారిపై దళిత సంఘాలు భారీ ర్యాలీకి దిగాయి. ఒక్కసారిగా దళిత సంఘాలు రోడ్డెక్కడంతో వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. రహదారికి ఇరువైపులా చాంతాడంత దూరం మేర వాహనాలు నిలిచిపోగా.. రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు హడావిడిగా అక్కడకు చేరుకుని దళిత సంఘాల సభ్యులను అక్కడికి నుంచి తరలించే యత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, దళిత సంఘాల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. వెరసి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై సమాచారం అందుకున్న మంత్రి హరీశ్ రావు.. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు నేరుగా రంగంలోకి దిగిపోయినట్టుగా సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాగైనా హుజూరాబాద్ ఎన్నికను నెగ్గాల్సిందేనన్న భావనతో కేసీఆర్ సర్కారు ప్రారంభించిన దళిత బంధు టీఆర్ఎస్ కు ప్రతిబంధకంగానే మారే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బైపోల్పై కేసీఆర్లో భయం మొదలైందా?