Guntur YCP Leaders In Dilemma With Sajjala Mark Plan :
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇప్పుడో ఆసక్తికర చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక జిల్లాగానే కాకుండా, రాష్ట్రంలోనే అత్యధిక ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు కలిగిన జిల్లాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న గుంటూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో.. వచ్చే ఎన్నికల నాటికి కొందరిని పక్కన పెట్టడం ఖాయమని పార్టీకి చెందిన సీనియర్లే అంటున్నారు. వీరిలో ఒక మహిళా ఎమ్మెల్యేతో పాటు.. ఇద్దరు ఎంపీలు కూడా ఉన్నారు. గుంటూరులో మొత్తం మూడు పార్లమెంటు స్థానాలు ఉంటే.. మొన్నటి ఎన్నికల్లో ఒకటి టీడీపీ దక్కించుకుంది. నరసారావు పేట, బాపట్ల పార్లమెంటు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. అయితే.. వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కొత్త వారికి స్థానం ఇస్తారని.. బాపట్ల నుంచి గెలిచిన నందిగం సురేష్ను ఎమ్మెల్యేగా పంపుతారని చర్చ సాగుతోంది. ఇక నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలును కూడా వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్యేగా పోటీ చేయించే దిశగా వైసీపీ యోచిస్తోందట. అందుకు ఆయన ఏమంటారన్న దానితో నిమిత్తం లేకుండానే పార్టీ హైకమాండ్ ప్రణాళికలు రచిస్తోందట.
ఆమెను తప్పించి..
ప్రస్తుతం తాడికొండ ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఫైర్ బ్రాండ్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టి.. ఆ సీటును నందిగం సురేష్కు అప్పగిస్తారని చర్చ సాగుతోంది. అయితే అదే సీటు కోసం ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరి శ్రీదేవిని పక్కనపెట్టాల్సి వస్తే.. ఆమెను ఎలా సముదాయిస్తారో కూడా చూడాలి. తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఇప్పుడు ఏకంగా మంత్రి పదవికే గురి పెట్టారు. అలాంటిది వచ్చే ఎన్నికల్లో పార్టీ సీటు దక్కకపోతే ఆమె ఊరుకుంటారా? అన్నది అనుమానమే. అదే సమయంలో నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని నరసారావుపేట లోక్సభ సీటు నుంచి పోటీలోకి దింపంపుతారని జిల్లా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక వేళ ఎన్నికల సమయానికి టీడీపీలో ఉన్న ఓ బలమైన కుటుంబం కనుక.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటే దీనిని ఆ కుటుంబానికి విడిచి పెట్టి గోపిరెడ్డిని నరసారావు పేటకే పరిమితం చేస్తారని అంటున్నారు. ఇక పొన్నూరు ఎమ్మెల్యేకు కూడా సీటు లేనట్టే అంటున్నారు.
రాజధాని ఎఫెక్ట్ తో..?
అదే సమయంలో టీడీపీ నుంచి వచ్చే నేతలను దృష్టి లో పెట్టుకుని వైసీపీ నేతలకు టికెట్లను కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో గుంటూరులో మంచి మార్కులు వచ్చాయి.. కదా? జంపింగ్లకు టిక్కెట్లు ఇవ్వడం ఎందుకు? అన్న ప్రశ్న పార్టీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం గుంటూరుపై రాజధాని ఎఫెక్ట్ పడింది. అయితే.. స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపించకపోయినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న నేతలే మళ్లీ రంగంలోకి దిగితే.. వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. దీనిని నివారించాలంటే.. రాజధాని ఎఫెక్ట్ ను జీరో చేసేసే నేతల కోసం వైసీపీ ఎదురు చూస్తోందట. అలాంటి సత్తా కలిగిన నేతలు వైసీపీలో కనిపించడం లేదని, అందుకే ఇతర పార్టీలకు చెందిన నేతలపై వల వేసే ప్లాన్ కు రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది.
టీడీపీ నేతలకు ఆఫర్లు..
ఈ క్రమంలోనే ప్రజల్లో సానుభూతి, మంచి పట్టు ఉన్న ఇతర పార్టీలు.. ప్రత్యేకించి టీడీపీకి చెందిన నేతలను తమవైపు తిప్పుకొని.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని వైసీపీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. సీఎం జగన్, పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే టీడీపీలో మంచి పేరున్న నేతలకు భారీ ఆఫర్లతో వల వేసే కార్యక్రమం త్వరలోనే మొదలు కానుందని జిల్లా పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆపరేషన్ ఆకర్ష్ బాధ్యతలను ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న సజ్ఝల రామకృష్ణారెడ్డి తన భుజాలపైకి ఎత్తుకోనున్నారట. ఈ కారణంగానే గడచిన కొంతకాలంగా ఆయన గుంటూరు వ్యవహారాల్లో తనదైన శైలి జోక్యం చేసుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలను ఆకర్షించడమంటూ జరిగితే వైసీపీలో కొందరు నేతల తలరాతలు మారిపోక తప్పదు. ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఫోజు కొడుతున్న వారికి మొండి చేయి తప్పదు. మొత్తంగా జిల్లాలో పార్టీ బలంగా ఉన్నా.. ఇతర పార్టీ నుంచి ప్రత్యేకించి టీడీపీ నేతలను ఆకర్షించాలన్న అధిష్ఠానం వ్యూహం ఏమిటో అర్ధం కాక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.