స్కిల్ కేసులో రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితి రోజురోజుకు అత్యంత దారుణంగా పడిపోతోంది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన నివేదికల్లో చంద్రబాబు ఆరోగ్య క్షీణిత గురించి స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జైలు అధికారులు బాబు ఆరోగ్య పరిస్ధితిపై చెబుతున్న దానికి వైద్యులు ఇచ్చిన నివేదిక పూర్తి భిన్నంగా ఉంది.
జైల్లో చంద్రబాబు అరోగ్య పరిస్థితిపై హైడ్రామా నడుస్తోంది. ప్రభుత్వాసుపత్రి శనివారం ఇచ్చిన నివేదిక ప్రకారం చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపుపై దద్దర్లు, స్కిన్ అలెర్జీలతో బాధపడుతున్నారని వెల్లడైంది. వైద్యులు సూర్యనారాయణ, సునీత దేవిలతో కూడిన వైద్య బృందం చంద్రబాబు ను పరిక్షించింది. అనంతరం ఈ నివేదికను జైలు అధికారులకు అందజేశారు. ఆ తరువాత చంద్రబాబును చల్లని ప్రాంతంలో ఉంచాలని వైద్య బృందం సూచించింది. అలానే ఐదు రకాల మందులను కూడా అందించాలని వైద్యులు జైలు అధికారులకు సిఫార్సు చేశారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్ధితిపై జైలు డీఐడీ రవికిరణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయనను ప్రత్యేకంగా స్నేహా బ్లాక్ లో ఉంచమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు జైలుకు వచ్చే సమయానికి 68 కేజీలు ఉన్నారని.. ప్రస్తుతం 67 కేజీలు ఉన్నారని చెప్పారు. ఎటువంటి అనారోగ్యం లేదు అన్నారు. బరువు తగ్గడం అన్నది అవాస్తవం అని చెప్పుకొచ్చారు. డిఐజీ స్థాయిలో వ్యక్తి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు.
శనివారం చంద్రబాబు ములాఖత్ తర్వాత అక్కడే ఉన్న డీఐజి కిరణ్ ని లోకేష్ కలిశారు. ప్రభుత్వాసుపత్రి నివేదిక చూపించి చంద్రబాబు అనారోగ్యం పై డీఐజీని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలున్నాయని నివేదిక చెబుతున్నా.. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. చల్లని వాతారవణంలో చంద్రబాబును ఉంచాలని వైద్యులు సూచిస్తుంటే జైలు అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సమాధానం చెప్పలేక ములాఖత్ సమయం ముగిసిందని బయటకు వెళ్లిపోవాలని లోకేష్ కు సూచించినట్లు తెలిసింది.