జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ సారి ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందని అన్ని పార్టీలూ, యంత్రాంగం భావించినా ఓటర్లు షాక్ ఇచ్చారు. 46.6 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5గంటల సమయానికి మరీ దారుణంగా 36 శాతం నమోదవగా చివరకు ఎన్నికల సంఘం 46.6 శాతం అని తేల్చింది.
ఇక పోలింగ్ శాతం విషయంలో ఎవరికి వారే తమ అంచనాలు వేసుకుంటున్నారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రూ.10వేల వరద సాయం అందని ప్రజలు పెద్ద సంఖ్యల్లో పోలింగ్ బూత్లకు వచ్చారని, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు తమకే పడిందని చెబుతున్నారు. ఇక ఉప్పల్, మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తాము గణనీయమైన స్థానాలు సాధిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేత వ్యాఖ్యానించారు. ఇలా ఎవరికి వారు తమ తమ సానుకూల అంశాలు, ప్రతి కూల అంశాలు లెక్కించుకుంటున్నారు. పాత బస్తీలో తమ పట్టు ఏ మాత్రం తగ్గదని, పోలింగ్ తక్కువగా నమోదైనా గతం కంటే సీట్లు మాత్రం పెరుగుతాయని మజ్లిస్ నాయకులు చెబుతున్నారు.
టీఆర్ఎస్ చెబుతున్నవివే..
ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రశాంత హైదరాబాద్ కోరుకున్నవారు తమకే ఓటు వేశారంటున్నారు. ఎక్కువగా 40 ఏళ్ల పైబడిన వారు ఆసక్తి చూపారని, బస్తీల్లో 50ఏళ్ల పైబడినవారు ఓటు వేశారని అంటున్నరు. ఆ ఓట్లలో సింహభాగం తమవేనని. పింఛన్లు, కల్యాణ లక్ష్మి, గ్రామాల్లో రైతు బంధు లాంటివి ఉపయోగ పడ్డాయని. సంఖ్య చెప్పలేం కాని తమదే విజయం అంటున్నారు.
బీజేపీ చెబుతున్నవి..
కేసీఆర్ హిందూ వ్యతిరేక విధానాలు, మోదీ ఇమేజ్, ఇతర రాష్ట్రాల ఓటర్లు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, వరద ముంపు బాధితులు, వరద పరిహారం రానివారు తమ వైపే ఉన్నారంటున్నారు. అయితే, ఓటింగ్ శాతం తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ చెబుతున్నవి:
గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటున్నారు. మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమాలో ఉన్నారు.
టీడీపీ చెబుతున్నవి:
తమ ఓటు బ్యాంకు తమకే ఉందని అంటున్నారు. ఇతర పార్టీలు తమ ఓటు బ్యాంకును చీల్చుదామని యత్నించినా వారికి సాధ్యం కాలేదంటున్నారు. గతంలో చంద్రబాబు చూపించిన ప్రగతి, టీడీపీ పాలన..ప్లస్ పాయింట్లని, గతంలో కంటే ఈ సారి తమకు ఓట్లు పెరుగుతాయని అంటున్నారు.
ఇవీ ఆయా పార్టీలకు ఉన్న అంచనాలు. అయితే, యువత, ఉద్యోగులు ఎటువైపు వేశారనే విషయంలో ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఎగ్జిట్ పోల్స్పైనా నిషేధం ఉన్న నేపథ్యంలో పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక ఎన్నికల విశ్లేషణ ప్రకారం పోలింగ్ శాతం ఎక్కువ ఉంటే అధికార పార్టీకి వ్యతిరేకమైన ఓటు అని, పోలింగ్ శాతం తక్కువ ఉంటే ప్రభుత్వానికి సానుకూల ఓటు అని గతంలో అంచనాలు ఉండేవి. చాలా సార్లు ఇంచుమించు అవే ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనూ విశ్లేషకులు అదే అంచనా వేస్తున్నారు. కాని 2018 తెలంగాణ, 2019 ఏపీ ఎన్నికలతోపాటు 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో సగటు ఓటింగ్ అంతకు ముందుతో పోల్చితే హెచ్చుతగ్గులు ఉన్నా.. అది నిజం కాలేదు.
బీజేపీ వైఫల్యం స్పష్టం..
ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి ఈ ఎన్నికలు కీలకం. అయితే ప్రత్యామ్నాయం తామేనని చెబుతున్న బీజేపీ.. ఈ ఎన్నికల్లో యువతను పోలింగ్ కేంద్రాలకు రప్పించే విషయంలో విఫలం అయిందని చెప్పవచ్చు. వరుస సెలవులు వస్తున్నాయని ముందుగానే తెలిసినా..బీజేపీ మాత్రం అలర్ట్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే.. బీజేపీ మాత్రమే యువతపై ఎక్కువ ఆశ పెట్టుకుంది. తాము అనుకున్న సెంటిమెంట్ ప్రకారం ఓట్లు పడాలంటే..యువతే కీలకమని ఆ పార్టీ నాయకులూ చెప్పారు. ఎంఐంఎంతో పోటీపడి వివాదాస్పద వ్యాఖ్యలు, ఆరోపణలపై శ్రద్ద చూపించారు. అయితే వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించే విషయంలో విఫలం అయ్యారు. అదే టైంలో టీఆర్ఎస్ స్థిర ఓటు బ్యాంకును పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చేసింది. మరోవైపు బీజేపీ ఇతర పార్టీల ఓటు బ్యాంకులను కూడా ఆకర్షించలేకపోయిందనే అంచనాలు ఉన్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు కారణం అని చెబుతున్నారు. ఎంఐంఎం ఓటర్లు.. ఎంఐంఎం పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలను 100 శాతం స్వాగతిస్తారు. కాని బీజేపీ తెరపైకి తెస్తున్న హిందూత్వ నినాద ఓటు బ్యాంకు వేరు. ఆ ఓటు బ్యాంకు అన్ని పార్టీల్లో కలసి ఉంటుంది… టీడీపీ, బీఎస్పీ, కాంగ్రెస్ (కొన్ని చోట్ల) లాంటి పార్టీల్లో అగ్రెస్సీవ్ ఓటు బ్యాంకు కంటే.. సాఫ్ట్ ఓటు బ్యాంక్, సైలెంట్ ఓటు బ్యాంక్ ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే.. సున్నితమైన అంశాలకు దూరంగా ఉండే ఓటర్లని చెప్పవచ్చు. వారు బీజేపీకి ఇంకా దూరంగానే ఉన్నారని భావిస్తున్నారు. అదే టైంలో జనసేన కూడా పెద్దగా కలసి రాలేదని చెప్పాలి. అందుకు జనసేనతో బీజేపీ వ్యవహార శైలి, అమిత్ షా టూర్లో జనసేన జెండాలను పక్కన పెట్టాలని స్వయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం, పవన్ కల్యాణ్ విషయంలో ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలు, సీమాంధ్రలో ముఖ్యంగా అమరావతి విషయంలో బీజేపీ వ్యవహారశైలి..ఇవన్నీ ప్రభావం చూపాయని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ అంచనాలు మాత్రమే.. ఫలితం తేలేది నాలుగో తేదీనే.