( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
జూనియర్ కళాశాలల్లో వసతులు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు చెమటలు పడుతున్నాయి. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ విద్య ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంజనీరు కావాలా? వైద్యుడు కావాలా? చార్టర్డ్ అకౌంటెంట్ కావాలా? ఇలా భవిష్యత్తు ఎటువైపయినా తొలి మెట్టు ఇంటర్ తోనే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయి విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా కరోనా కారణంగా చాలా జాప్యం జరిగింది. దానికి తోడు ఈ ఏడాది నుంచి ఆన్లైన్లో జూనియర్ ఇంటర్మీడియట్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించడంతో గందరగోళం మొదలైంది. విద్యార్థులు కోరుకున్న అనేక కళాశాలల పేర్లు ఆన్లైన్లో కనిపించడం లేదు. జూన్లో జరగాల్సిన ఈ అడ్మిషన్ల ప్రక్రియ అక్టోబరులో ప్రారంభమైంది. ఈ నెల 21 నుంచి 29వ తేదీ వరకు అడ్మిషన్లకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. జూనియర్ ఇంటర్లో నచ్చిన కళాశాలలో చేరేందుకు వెబ్సైట్లో లాగిన్ అయ్యి విద్యార్ధి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే వారు కోరుకున్న కళాశాలల పేర్లు కనిపించక ఎలా నింపాలో అర్థం కాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.
నిబంధనలు పాటిస్తేనే..
నిబంధనల ప్రకారం పత్రాలు సమర్పించని కారణంగానే ఆయా విద్యా సంస్థలకు అనుమతులు లేవని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 361 కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలు 39, కేజీబీవీ 17, గిరిజన సంక్షేమ శాఖకు చెందిన 10, బిసి వెల్ఫేర్ 2, సాంఘిక సంక్షేమ శాఖకు చెందినవి 11, ఎయిడెడ్ మరో 11, మోడల్ స్కూల్స్ 5, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు 268 ఉన్నాయి. వీటిలో ప్రముఖ కళాశాలలైన చైతన్య, నారాయణ కళాశాలల పేర్లు ఎక్కడా కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా సగానికి పైగా కళాశాలల పేర్లు వెబ్సైట్లో లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ బోర్డు నిర్దేశించిన ధ్రువపత్రాలు సమర్పించిన కళాశాలల్లో మాత్రమే ప్రస్తుతం అడ్మిషన్లకు అవకాశం లభిస్తోంది. విశాఖ జిల్లాలో ప్రతియేటా సుమారు 50 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్లో చేరుతుండగా అందులో సుమారు 30 వేల మంది ఈ రెండు ప్రముఖ విద్యాసంస్థల్లో చేరుతుంటారు. అనేక కళాశాలలు ఆన్లైన్ క్లాసులు కూడా ఇప్పటికే ప్రారంభించాయి. తీరా అధికారికంగా అక్కడ అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తే వాటి పేర్లు లేకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేక పోయినా, కింద ఫ్లోర్లో కమర్షియల్ భవనాలు ఉన్నచోట్ల కళాశాల నిర్వహణకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వడం లేదు. అదే విధంగా కోవిడ్ – 19 కి సంబంధించిన ప్రమాణాలు చూపకపోయినా అనుమతులు లభించడంలేదు.
ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రస్తుతం విద్యాశాఖ కమిషనర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నందున స్థానిక అధికారులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. అడ్మిషన్ల గడువు ముగియడంతో పొడిగిస్తారా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. మెజారిటీ విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో గడువు పెంచుతూ త్వరలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.











