విద్యారంగం వ్యాపారం అయిపోయింది. అది ఇప్పుడు జరిగిన పరిణామం కాదు. నాలుగు దశాబ్ధాల కిందట గుంటూరులో రవి కాలేజీతో ప్రారంభమైంది. నేడు అనేక ప్రయివేటు విద్యా సంస్థలు శాఖోపశాఖలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించాయి. చివరకు అపార్టుమెంటులాంటి భవనాల్లో కూడా కాలేజీలు నడుపుతున్నారు. తమ పిల్లలకు మంచి ర్యాంకు వస్తే చాలని తల్లిదండ్రులు కూడా భావించడంతో ప్రయివేటు కాలేజీలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టేశారు.
దీంతో కళాశాలలు పాటించాల్సిన నిబంధనల్ని తుంగలో తొక్కేశారు. పాఠశాలలు, కళాశాలల నిర్వహించడానికి అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫైర్ సేఫ్టీతోపాటు, విద్యార్ధులు ఆడుకునేందుకు క్రీడా మైదానం ఉండాలి. కాలేజీలు, పాఠశాలలు అపార్టుమెంట్లులాంటి భవనాల్లో నడుస్తుంటే ఇక మైదానాలు ఎక్కడ నుంచి వస్తాయి. అవినీతికి అలవాటు పడ్డ విద్యాశాఖ అధికారులు నాలుగు దశాబ్దాలుగా చూసీచూడనట్టు వ్యవహరించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో ప్రయివేటు పాఠశాలలు, కళాశాలకు గడ్డుకాలం వచ్చింది. ఏపీలో నిబంధనలు ఉల్లంఘించిన 600 పాఠశాలలు, కళాశాలలకు అనుమతులు రద్దు చేశారు.
మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన 600 ప్రయివేటు పాఠశాలలు, కళాశాలన్నీ పేరున్న సంస్థలవే కావడం గమనార్హం. వీటిల్లో ఐఐటీకి లాంగ్ టర్మ్ కోచింగులు కూడా నడుస్తున్నాయి. గతంలో జాతీయ స్థాయిలో అనేక ర్యాంకులు కూడా సాధించిన కళాశాలలు వీటిలో ఉన్నాయి. అకస్మాత్తుగా ఫైర్ సేప్టీ పాటించడం లేదని, మైదానం లేదని అనుమతులు రద్దు చేయడంతో విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ కళాశాలలో చేరాలో కూడా విద్యార్థులకు అర్ధం కావడం లేదు.
క్లాసుకు 40 మంది మించరాదనే నిబంధన కూడా కఠినంగా అమలు చేయడంతో ఇక కళాశాలలు నడపలేమని యాజమాన్యాలకు అర్థమైంది. అందుకే వారు కూడా చేతులెత్తేశారు. దీనికి తోడు కరోనా కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. నేటికీ విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. చాలా మంది విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రద్దయిన కళాశాలల యాజమాన్యాలు కూడా వాటిని తెరిచే ప్రయత్నాలు కూడా చేయడం లేదని తెలుస్తోంది.
ప్రభుత్వం అన్నీ నిబంధనలు కఠినంగా అమలు చేస్తే 90 శాతం ప్రయివేటు విద్యాసంస్థలు మూసివేసుకోవాల్సిందేనని విజయవాడకు చెందిన ఓ ప్రముఖ విద్యాసంస్థల యాజమాన్యం అభిప్రాయపడింది. అంటే దీన్ని బట్టి ప్రభుత్వం నిబంధనలు సడలించడం లేదా, చూసీ చూడనట్టు వ్యవహరిస్తే తప్ప ప్రయివేటు విద్యాసంస్థలు తెరచుకునే అవకాశం కనిపించం లేదు.
టీడీపీతో అనుబంధమే దెబ్బతీసిందా?
తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో డబ్బు సరఫరా చేశారని భావిస్తున్న విద్యాసంస్థలపై వైసీపీ ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం నేతలతో సన్నిహితంగా మెలుగుతూ ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో గుట్టుగా విరివిగా విరాళాలు అందించిన విద్యాసంస్థలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
విజయవాడలో 80 విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయగా అందులో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేరున్న విద్యాసంస్థల యజమానికి చెందిన సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన మరో విద్యాసంస్థకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అంటే టీడీపీకి నిధులు పారించిన విద్యాసంస్థల యాజమాన్యాలను ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోందని భావించాల్సి వస్తోంది.
పట్టణీకరణ నేపథ్యంలో విద్యాశాఖ నిబంధనల మార్పు తప్పదా?
పట్టణీకరణ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు క్రీడా మైదానాలు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన విద్యాసంస్థల పాలిట శాపంగా మారింది. ప్రయివేటు విద్యాసంస్థలు ఫీజులు ఎక్కువ వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నా, ఆ స్థాయిలో ఫీజులు చెల్లించగలిగిన వారే ఆయా సంస్థల్లో తమ పిల్లలను చదివించుకుంటున్నారని మరచిపోకూడదు. ఫైర్ సేఫ్టీ లాంటి నింబంధనలు కఠినంగా అమలు చేసినా అందరూ సమర్ధిస్తారు. కానీ సాధ్యంకాని అనేక నిబంధనలు పెట్టడం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలు పట్టణ శివారు ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉంది. అలా తరలించడం వల్ల విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాల్సి ఉటుంది. దీనికి అదనంగా ఏటా మరో రూ.24 వేలు వసూలు చేస్తారు. ఇవి కూడా తల్లిదండ్రులే భరించాల్సి ఉంటుంది.
60వేల మంది రోడ్డున పడ్డారు
తెలుగు రాష్ట్రాలో ప్రయివేటు విద్యాసంస్థలదే హవా. రెండు తెలుగు రాష్ట్రాల్లో 8 లక్షల మంది ఉపాధ్యాయులు ప్రయివేటు విద్యాసంస్థలో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తే విద్యాసంస్థల్లో 90 శాతం మూతపడటం ఖాయం. అంటే ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు పోయి రోడ్డున పడతారు. ఇవన్నీ పరిశీలించి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.











