నటుడు, నిర్మాత నూతన్ నాయుడు దళిత యువకుడు శ్రీకాంత్ శిరోముండనం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన పాపాల చిట్టా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట పలువురిని నూతన్ నాయుడు మోసగించేందుకు ప్రయత్నించారని అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో ఆయన చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన 12 కోట్లు తీసుకున్నట్లు వైజాగ్, మహారాణిపేటలో నూతన్ నాయుడుపై కేసు నమోదయింది. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాంత్ రెడ్డి, విశాఖకు చెందిన నూకరాజు మంచి స్నేహితులు. వీరిలో శ్రీకాంత్ రెడ్డి తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా నూకరాజు అనే వ్యక్తి వైజాగ్ లోనే సీసీ కెమెరాల బిజినెస్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి నూతన్ నాయుడు పరిచయమయ్యారు.
తనకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయంటూ వారిని నూతన్ నాయుడు నమ్మబలికారు. దీంతో వారు నూతన్ నాయుడిని పూర్తిగా నమ్మారు. ఎస్బీఐలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నూతన్ నాయుడు చెప్పడంతో వారు నమ్మారు. ఎస్బీఐ సౌత్ రీజియన్ డైరెక్టర్ పదవి కోసం శ్రీకాంత్ రెడ్డి ఏకంగా 12 కోట్లు నూతన్ నాయుడుకు ఇవ్వగా బ్యాంకు జాబ్ కోసం నూకరాజు 5 లక్షలు చెల్లించినట్లు ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. చెప్పిన గడువులోగా ఉద్యోగాల రాకపోవడంతో బాటు నూతన్ నాయుడు వ్యవహార శైలి మారిపోవడంతో వారు తమ డబ్బులను తమకు వాపసు చేయవలసిందిగా డిమాండ్ చేశారు.
డబ్బులు తీసుకొని రెండేళ్లు గడిచినా నూతన్ నాయుడు వాయిదాల మీద వాయిదాలు చేస్తూ ఇప్పటివరకు వారికి డబ్బులు వాపసు ఇవ్వలేదు. ఇదే సమయంలో శిరోముండనం కేసులో ఆయన అరెస్ట్ కావడంతో బాధితులు మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 12 కోట్లు నిజంగా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో మరో వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శశికాంత్ అనే వ్యక్తి కూడా వీరిని మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు అతని కోసం అన్వేషణలో ఉన్నారు.