రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీని విడుదలకు సిద్ధం చేశారు. పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కానున్న ఈ సినిమా తర్వాత మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ మూడూ పాన్ ఇండియా సినిమాలే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా. వీటిలో సలార్, ఆదిపురుష్ సినిమాలు రెండూ సెట్స్ మీదున్నాయి. ఇప్పుడు ప్రభాస్ లిస్ట్ లోకి మరో సినిమాకూడా వచ్చి చేరిందని సమాచారం.
‘ఖైదీ, మాస్టర్’ సినిమాలతో తమిళనాట మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈ రెండు సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే తమిళంలో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టాయి. అలాంటి దర్శకుడు లోకేష్ కనగరాజ్ .. ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశాడని టాక్. ఇప్పటికే ప్రభాస్ కు లైన్ వినిపించాడని, ప్రభాస్ కు అది నచ్చి, పూర్తి స్ర్కిప్ట్ తో వస్తే .. సినిమా చేస్తానని ప్రభాస్ మాటిచ్చారని తమిళనాట టాక్ నడుస్తోంది.
కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయ్యాకా లోకేష్ కనగరాజ్ సినిమా కోసం ప్రభాస్ రంగంలోకి దిగుతాడట. ప్రస్తుతం కమల్ హాసన్ తో విక్రమ్ అనే మూవీ రూపొందించే బిజీలో ఉన్న లోకేశ్ .. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభిస్తాడట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రభాస్, లోకేష్ కాంబినేషన్ కు ప్రభాస్ అభిమానుల ఖుషీ అయిపోతున్నారు. మరి నిజంగానే లోకేష్ కు ప్రభాస్ అవకాశమిస్తాడో లేదో చూడాలి.