వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. 2027 నుండి తాను పాదయాత్ర ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపాడు.. గతంలో ఆయనని అధికార పీఠం ఎక్కించిన పాదయాత్ర.. మరోసారి తనను సీఎంని చేస్తుందని కలలు కంటున్నారు జగన్.. మరి, ఆయన పాదయాత్ర అధికార దాహం సంగతి సరే, ఆయనని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఒకసారి చెక్ చేద్దాం..
జగన్ తాను పాదయాత్ర 2.0 షురూ చేస్తానని ఎంతో ఆర్భాటంగా ప్రకటించినా, ఆ పార్టీ పొలిటికల్ కేడర్ మాత్రం రెడీగా లేదు.. గతేడాది జరిగిన ఎన్నికలలో YCP కేవలం 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్సభ సీట్లకు పరిమితమయింది.. 151 సీట్లలో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమి పార్టీ క్యాడర్ను నిరాశలో ముంచెత్తింది. చాలా మంది నాయకులు TDP, JSP, లేదా బీజేపీలో చేరారు, మిగిలిన వారు పాదయాత్రలో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదనే చర్చ జరుగుతోంది.. .
జగన్ యొక్క 2017 పాదయాత్ర సక్సెస్కి ఐ ప్యాక్ వ్యూహాలు కలిసి వచ్చాయి.. వైసీపీ అధినేతకి సొంతంగా వ్యూహాలు రచించలేరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. 2024లో ఆయన ఓటమికి ఇదే మైనస్ అని చెబుతారు.. I-PAC సర్వేలపై అతిగా ఆధారపడిన జగన్, స్థానిక నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకపోవడం 2024 ఓటమికి కారణమని YSRCP నాయకులే విమర్శించారు. అయిదేళ్ల పాటు సొంత కేడర్ని నిర్లక్ష్యం చేసిన జగన్… నేడు వారిని ఎలా ఆకట్టుకుంటారనేది కీలకంగా మారుతోంది.. సీఎంగా ప్యాలెస్కే పరిమితమై, పరదాల చాటున దాక్కున్న జగన్.. ప్రతిపక్ష నేతగా మునుపటిలా కేడర్ని కన్విన్స్ చేస్తారా?. అనేది కీలకంగా మారుతోంది..
2019-2024 పాలనలో నవరత్నాలు, ఆయన నమ్ముకున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) స్కీమ్ల ద్వారా రూ. 3.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు జగన్ ప్రకటించాడు. ఈ సంక్షేమ పథకాలతో ఉపాధి అవకాశాల సృష్టి జరగలేదు.. రోడ్లు నిర్వీర్యం అయ్యాయి.. కొత్త పరిశ్రమలు ఏపీ గడప తొక్కలేదు.. ఇటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను రూ. 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టాయి. 2024 ఎన్నికలలో ఓటర్లు, ముఖ్యంగా యువత, “మీరు డబ్బు ఇస్తున్నారు, కానీ మా భవిష్యత్తు ఏమిటి?” అని ప్రశ్నించారు. మరోవైపు, కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి అవకాశాల సృష్టి, కొత్త కంపెనీల రాక, రోడ్లను రిపేర్ చేయడంతో ప్రజల మనసును చూరగొంది.. వీటికి జగన్.. తన పాదయాత్రలో ఎలాంటి సమాధానాలు చెబుతారనేది ఆసక్తిగా మారుతోంది..
ఇక, అమరావతి రాజధాని అంశంపై జగన్ ఇప్పటికీ ఒక స్టాండ్ని ప్రకటించలేకపోతున్నారు. ఇటీవల ఎన్నికలలో ఓటమితో వైసీపీ మూడు రాజధానుల అంశం ప్రజల మనసునుండి చెరిగిపోయింది.. ఏపీకి ఒక్క రాజధాని చాలని, అది అమరావతి అని తేల్చి చెప్పారు.. దీనిపై సరయిన రాజకీయ విధానం ప్రకటించకుండా, జగన్ తన పాదయాత్రలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు..
TDP-JSP-BJP కూటమి, మరోవైపు, అమరావతిని రాజధానిగా పునరుద్ధరించి, విశాఖపట్నంను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించింది. 2024-25 మధ్య, రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చాయని చంద్రబాబు ప్రకటించారు.. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తోంది… ఈ ఆర్థిక విజయం జగన్ పాదయాత్రను నీరుగార్చిడం ఖాయంగా కనిపిస్తోంది..
జగన్ గతంలో చేసిన పాదయాత్రకి, నేడు చేయాలని ఫిక్స్ అయిన పాదయాత్రకి ఎంతో తేడా ఉంది.. నాడు 2017 పాదయాత్ర సమయంలో, అతను చంద్రబాబు నాయుడు TDP పాలనపై విమర్శలతో ప్రజలను ఆకర్షించాడు. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై దాడి చేశాడు. ఇది కలిసి వచ్చింది.. కానీ, ముఖ్యమంత్రిగా జగన్ ఏపీని ఒక ఎడారిగా మార్చారు.. తన కేసులను పోస్ట్ పోన్ చేసుకోవడానికి మినహా, ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలను సాధించడానికి ఏమీ చేయలేకపోయారని ప్రూవ్ అయింది.. నేడు కొత్తగా ఆయన ఏ విమర్శలు చేస్తారనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి…
జగన్కి నాడు కుటుంబం మొత్తం అండగా నిలిచింది.. ముఖ్యంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఎంతో దోహదం చేశారు.. 2024లో, జగన్ రాజకీయంగా ఒంటరిగా మిగిలాడు. అతని సోదరి వై.ఎస్. షర్మిల, కాంగ్రెస్లో చేరి, జగన్పై తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్, అవినాష్ రెడ్డిపై ఆయన సోదరి సునీత ఆరోపణలు చేసింది. ఈ కేసు జగన్ ఇమేజ్ను దెబ్బతీసింది. దీనిపై జగన్ నేటికీ తప్పించుకు తిరుగుతున్నాడు..
వీటిని మించి జగన్పై అధికారంలో ఉన్న సమయంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి.. నేడు వాటిపై విచారణ జరుగుతోంది.. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ జైలుకి వెళతాడని, త్వరలోనే ఆయన జైలు యాత్ర మొదలు పెట్టనున్నాడని, మరి, పాదయాత్ర ఎలా చేస్తాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు.. ఏది ఏమయినా, జగన్ పాదయాత్ర చేసినా, పొర్లు దండాల యాత్ర చేసినా, రాజకీయంగా మైలేజ్ తీసుకువస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.. వైసీపీ కేడర్లోనే అనుమానాలున్నాయి.. 2027 నాటికి ఏపీలో రాజధాని అమరావతి పట్టాలెక్కి, పోలవరం పూర్తయి, ఉపాధి అవకాశాల కల్పన జరిగితే, జగన్ ఏ యాత్ర చేసినా ప్రయోజనం శూన్యం..