సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఘాటుగా బుద్ధి చెప్పినప్పటికీ వైసీపీ నేతల తీరు మారడం లేదు. గడిచిన ఐదేళ్లు రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్రను మిగిల్చిన వైసీపీ నేతలు..ఇప్పటికీ కూడా అమరావతికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు, పార్టీ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. అమరావతిపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అమరావతిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం..ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలపై కేబినెట్లో చర్చ జరిగింది. అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తూ మిగిలిన ప్రాంతాలను విస్మరిస్తున్నారన్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని మంత్రులకు సూచించారు.
2014-19 మధ్య కూడా వైసీపీ నేతలు ఇదే తరహాలో ప్రచారం చేశారని, ఆనాడు ఆ ప్రచారాన్ని సరిగా తిప్పికొట్టలేకపోయామన్నారు. అమరావతి స్వయంసమృద్ధి నగరమని, దానికి ఇతర ప్రాంతాల నిధులు మళ్లించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్నారు. అమరావతి నిర్మాణ దశ నుంచే రాష్ట్రానికి ఆదాయ వనరుగా మారుతుందని..ఉద్యోగవకాశాల గనిగా మారుతుందనే విషయాలను వారికి స్పష్టం చేయాలన్నారు. అమరావతి నిర్మాణ వ్యయంలో అధిక శాతం రాజధాని భూముల నుంచే సమకూరుతుందని, ఇతర ప్రాంతాల నిధులను మళ్లించాల్సిన అవసరం లేదనే అంశాన్ని అర్ధమయ్యేలా వివరించాలని సీఎం కోరారు.
ప్రొటోకాల్పై దృష్టి పెట్టండి ముఖ్యమైన అధికారిక కార్యక్రమాల్లో తలెత్తుతున్నప్రొటోకాల్ ఇబ్బందులపైనా కేబినెట్లో చర్చ జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ సమస్య లేకుండా చూడాలన్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ హాజరైన సభావేదికపై కేంద్రమంత్రులు ఓవైపు..రాష్ట్రమంత్రులు ఇంకోవైపు కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని..అలా చేయకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రుల మధ్యలో కూర్చోవలసి వచ్చిందని తెలిపారు. ప్రధానికి చెరోవైపు గవర్నర్, సీఎం కూర్చోగా.. చంద్రబాబు పక్కన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన పక్కన పవన్ కూర్చున్నారు. డిప్యూటీ సీఎం తన పక్కనే కూర్చునేలా సీటింగ్ ఏర్పాట్లు ఉండాల్సిందన్నారు. ఇలాంటివి మరోసారి రిపీట్ కాకూడదన్నారు.
పథకాల పేర్లూ జనంలోకి వెళ్లాలి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దఎత్తున పథకాలను అమలుచేస్తున్నా వాటిపేర్లు ప్రజల్లోకి వెళ్లేలా లేవని డిప్యూటీ సీఎం పవన్ అభిప్రాయపడ్డారు. పథకాల పేర్లు ఆకర్షణీయంగా..ఆకట్టుకునేలా ఉంటే ఎలాంటి ప్రచారం లేకున్నా ప్రజల్లోకి వెళ్తాయని వ్యాఖ్యానించగా సీఎం, మంత్రులు ఏకీభవించారు. ఉగ్ర శిబిరాలపై దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ పేరు చాలా బాగుందని, ప్రజల మూడ్ను..సెంటిమెంట్ను టచ్ చేసేలా ఉందని కేబినెట్ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. మంత్రులు, ఎమ్మెల్యేలు P-4 కార్యక్రమంపై దృష్టి సారించాలన్నారు చంద్రబాబు.పేదకుటుంబాలను పైకి తీసుకురావడానికే కాకుండా జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికీ వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లాల అభివృద్ధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని కోరారు.
ప్రతి నియోజకవర్గంలో MSME పార్కులను ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పిస్తామని..అక్కడకు పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యతను వారు తీసుకోవాలని సూచించారు. లోకేశ్ కార్యక్రమంపై చర్చ మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ చేపట్టిన ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. పేదలకు ఇంటి హక్కు కల్పించేలా చేపట్టిన ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా చేపడితే బాగుంటుందని సీఎం అన్నారు. పేదలకు ఆస్తి హక్కు కల్పించే ఇలాంటి కార్యక్రమాలపై మంత్రులు దృష్టి సారించాలని సూచించారు.