జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక సూత్రధారులను సిట్ అరెస్టు చేసింది. ఐతే తాజాగా లిక్కర్ స్కామ్లో భాగంగా వసూలు చేసిన వేల కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరుకు చేరేవని సిట్ గుర్తించింది. ఈ అక్రమ సొమ్ములో అత్యధికంగా స్థిరాస్తి రంగంలోకి మళ్లించి భారీగా పెట్టుబడి పెట్టినట్లు విచారణలో తేలింది. ఒక్క బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో రూ.1,000 కోట్లకు పైగా పెట్టినట్లు సిట్ భావిస్తోంది. ఎక్కడి నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏయే మార్గాల ద్వారా రూటింగ్ చేసి, స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించాలనే దానిపై బెంగళూరులో ప్రతి వారం కీలక సమావేశాలు జరిగేవని సిట్ గుర్తించింది.
భారతి సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్, జగన్ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే గోవిందప్ప బాలాజీతో పాటు, వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి ఈ వ్యవహారంలో కీ రోల్ ప్లే చేశారని సిట్ గుర్తించింది. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేరుస్తూ తాజాగా కోర్టులో మెమో కూడా దాఖలు చేసింది. ఏయే స్థిరాస్తి కంపెనీల్లోకి ఎలా డబ్బులు మళ్లించారు. దీని కోసం ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు, వాటిని అడ్డం పెట్టుకుని మనీ రూటింగ్ ఎలా చేశారు. ఈ సొత్తంతా చివరికి ఎవరికి చేరింది? అనే దానిపై ఇప్పుడు సిట్ దృష్టి సారించింది. మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు సొమ్ము తరలించినట్లు గుర్తించి..విచారణ జరుపుతోంది.
రాజ్ కసిరెడ్డి బృందం ఐదురోజులకోసారి ముడుపులు వసూలు చేసి జగన్ పెదనాన్న వైఎస్ జార్జిరెడ్డి కుమారుడైన అనిల్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి, వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిలకు అందజేసేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది. రాజ్ కెసిరెడ్డి గ్రూప్ కొన్ని డిస్టిలరీలను గుప్పిట్లో పెట్టుకుని వాటికి APSBCL నుంచి భారీగా చెల్లింపులూ చేసింది. ఆ తర్వాత ఆయా డిస్టిలరీల నుంచి అనేక కల్పిత కంపెనీల ఖాతాల్లోకి సొమ్ము జమైంది. ఇవన్నీ రాజ్ కసిరెడ్డి తన అనుచరులతో సృష్టించారు. కల్పిత కంపెనీల ఖాతాల్లో నుంచి వివిధ మార్గాల్లో రూట్ చేసి..స్థిరాస్తి సంస్థల్లోకి పెట్టుబడులుగా మళ్లించారని సిట్ గుర్తించింది.