ఏపీకి మరో భాకీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రాబోతుంది. నౌకా నిర్మాణ రంగంలో అగ్రగామిగా ఉన్న రక్షణరంగ సంస్థ మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ ఏపీలో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉంది. దుగరాజపట్నంలో ప్రతిపాదించిన షిప్ బిల్డింగ్ క్లస్టర్ అభివృద్ధిపై MDL ప్రతినిధులు ఇటీవల సీఎం చంద్రబాబుతో చర్చించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ఏకంగా రూ.26,000 కోట్ల భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ నిధులను విదేశాల నుంచి కూడా సమీకరించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
నవరత్న హోదా కలిగిన MDL సంస్థ.. భారత నౌకాదళం, తీర రక్షక దళాల కోసం డెస్ట్రాయర్స్, స్టెల్త్ ఫ్రిగేట్లు, కార్వెట్లు, పెట్రోలింగ్ నౌకలతో పాటు జలాంతర్గాములను నిర్మించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. వాణిజ్య నౌకల నిర్మాణంలోనూ ఈ సంస్థకు అపార అనుభవం ఉంది. 1934లో ఏర్పాటైన ఈ సంస్థను 1960లో కేంద్ర ప్రభుత్వం టేకోవర్ చేసింది. రాష్ట్ర విభజన చట్టం నిబంధనల మేరకు దుగరాజపట్నంలో పోర్టును అభివృద్ధి చేయాల్సి ఉన్న నేపథ్యంలో.. దశాబ్దాల అనుభవం ఉన్న MDLతో ఒప్పందం చేసుకోవడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రాజెక్టు పెట్టుబడులు, రాయితీల విషయానికొస్తే.. MDL సంస్థ మూలధన పెట్టుబడిలో 30 శాతం సబ్సిడీ ఇవ్వాలని సీఎం చంద్రబాబుతో జరిగిన చర్చల్లో ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ రాయితీ కింద ఎంత మొత్తం అనుమతించాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిశితంగా పరిశీలిస్తోంది. ఇక దుగరాజపట్నంలో పోర్టు అభివృద్ధికి అవసరమైన కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద పోర్టు, షిప్బిల్డింగ్ క్లస్టర్కు అవసరమైన విలువైన భూములను సమకూర్చనుంది.
ఈ మెగా ప్రాజెక్టు కోసం ఏపీ మారిటైం బోర్డు ఇప్పటికే భూసేకరణ కార్యాచరణను ముమ్మరం చేసింది. పోర్టు, షిప్యార్డు నిర్మాణానికి అనువుగా సుమారు 2,200 ఎకరాలను సేకరించే పనిలో పడింది. ఇందులో షిప్యార్డు కోసం 1,000 ఎకరాలు, ఇతర అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం 1,350 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దుగరాజపట్నం పోర్టు, షిప్బిల్డింగ్ క్లస్టర్ పనుల అభివృద్ధి, పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ మారిటైం బోర్డుతో పాటు విశాఖపట్నం పోర్టు అథారిటీలు సంయుక్తంగా చేపట్టనున్నాయి.
ప్రాజెక్టును వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దుగరాజపట్నం పోర్టు, షిప్బిల్డింగ్, నౌకల మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సంబంధించి DPR రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం టెక్నికల్ కన్సల్టెంట్ను ఎంపిక చేసేందుకు EOI ప్రకటన కూడా జారీ చేసింది. ఈ నెల 24న దీనిపై వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి తగిన సంస్థను DPR తయారీకి ఎంపిక చేయనున్నారు. ఈ కన్సల్టెంట్ సంస్థ.. షిప్యార్డు లేఅవుట్, మాస్టర్ప్లాన్తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చుల అంచనాలను ప్రభుత్వానికి అందించనుంది.











