(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన వచ్చిన తరువాత ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజనులకు మేలు చేకూర్చేందుకు, సమున్నత విద్యను అందించేందుకు విజయనగరం జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం ప్రతిపాదించారు. అందు కోసం విశాఖపట్నం – విజయనగరం సరిహద్దుల్లో ఉన్న కొత్తవలసలో సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. 2019లో విజయనగరం కేంద్రంగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీ భవనంలో తరగతులు ప్రారంభించారు.
వైసీపీ హయాంలో ..
2019లో రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వైసీపీ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని కొత్తవలస నుండి సాలూరుకు మార్చింది. ఆంధ్రా – ఒడిశా బోర్డర్లో ఉన్న సాలూరు ప్రాంతమైతే రెండు రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది. గిరిజన ప్రాంతమైన సాలూరులో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, గిరిజనులకు అనువుగా ఉంటుందని స్పష్టీకరించింది.
కేంద్ర కమిటీ పరిశీలనతో ..
ఆ నేపథ్యంలో కేంద్ర కమిటీతో పాటు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, జిల్లా అధికారులు సాలూరు ప్రాంతంలోని సుమారు 500 ఎకరాల స్థలాన్ని మూడు నెలల క్రితం పరిశీలించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. స్థానిక అధికారులు పూర్తి స్థాయి ప్రతిపాదనలు పంపిస్తే వెంటనే ఖరారు చేసి నిధులు మంజూరుకు, పనులు ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ ప్రాంత వాసులంతా త్వరలోనే ఇక్కడ యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ప్రతిపాదనలు మారిపోవడంతో జిల్లా ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు దత్తిరాజేరు-మెంటాడ మండలాల మధ్య కుంటినవలస ప్రాంతంలో ప్రతిపాదించిన స్థలాన్ని ప్రొఫెసర్ కట్టమణితో కలిసి విజయనగరం ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్ మూడు రోజుల క్రితం పరిశీలించారు. నీటి లభ్యత, జాతీయ రహదారి నుంచి దూరం తదితర వివరాలను తెలుసుకున్నారు. గిరిజన వర్సిటీకి అనుకూలతపై సర్వే చేస్తున్నట్లు ఈ సందర్భంగా విజయనగరం ఆర్డీవో తెలిపారు. దాంతో జిల్లా ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
రియల్ మాఫియా
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం పేరిట ఉత్తరాంధ్రకు చెందిన కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు స్థానిక రాజకీయ నాయకులను ప్రసన్నం చేసుకుని స్థల ప్రతిపాదనలు మార్పిడి చేయిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కొత్తవలస ప్రాంతంలో యూనివర్సిటీ వస్తుందని విస్తృత ప్రచారం చేసి ఆ ఏరియా అంతటా భూములు ఉన్న ధర కంటే నాలుగైదు రెట్లు అదనంగా అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం సాలూరులో కూడా అదే పరిస్థితి పునరావృతమైందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు జిల్లాలో బాగా డిమాండ్ ఉన్న గజపతినగరం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
ఏదేమైనా ఐదేళ్లుగా కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భవన నిర్మాణం ప్రతిపాదనల దశలోనే నిలిచి పోతుండటం వల్ల దాని అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, తరగతుల నిర్వహణకు, వసతికి అవస్థలు తప్పడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా అభివృద్ధికి, గిరిజనులకు అనువైన స్థలంలో యూనివర్సిటీ నిర్మించాలని కోరుతున్నారు.











