విజయనగరం జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గమైన పార్వతీపురంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్వతీపురంలో సీనియర్ వైసీపీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ ద్వారాపురెడ్డి శ్రీనివాసరావు బీజేపీలో చేరారు. ఆయనతో పాటు వైసీపీలో కీలకపాత్ర పోషిస్తున్న ఆయన అనుచరులనూ తీసుకుపోవడంతో అక్కడ వైసీపీ బలహీన పడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
గుర్తింపు కొరవడటంతోనే ..
గత సాధారణ ఎన్నికల్లో పార్వతీపురం నుండి వైసీపీ గెలుపునకు తీవ్ర కృషి చేసిన శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అధిష్టానం దృష్టిలో పెట్టినప్పటికీ స్పందన కొరవడిందని ఆయన అనుయాయులు మధనపడుతున్నారు.
ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలతో ..
పార్వతీపురం ప్రస్తుత ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఒంటెద్దు పోకడలతోనే శ్రీనివాసరావు, ఆయన అనుచరులు పార్టీ వీడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా బలీయుడైన శ్రీనివాసరావు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున జోగారావు ఎన్నికకు మూలకారకుడని తెలుస్తోంది. జోగారావు ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత శ్రీనివాసరావును పట్టించుకోవడం మానేశారని, అధిష్టానం కూడా ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆయనతో పాటు ఆయన అనుయాయులు బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొద్దిరోజులుగా తర్జనభర్జనలు పడ్డ శ్రీనివాసరావు ఎట్టకేలకు బీజేపీ తీర్థం తీసుకున్నారు.
రేపోమాపో నూతన జిల్లా కేంద్రంగా ఆవిర్భవించనున్న పార్వతీపురంలో వైసీపీకి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. భవిష్యత్తులో ఇది అక్కడ టీడీపీకి లాభించే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.