(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది. అంతేకాదు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, శ్రీకాకుళంతో అనుబంధం ఉన్న విజయనగరం, విశాఖపట్నం, అరకు పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీ విజయ కేతనం ఎగురవేసి రాష్ట్రంలో విజయనగరం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా విజయనగరానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పించింది. ఈ జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పాముల పుష్ప శ్రీవాణిని ఉప ముఖ్యమంత్రిగా, చీపురుపల్లి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స సత్యనారాయణను కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించింది. జిల్లాలో ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీకి చెందిన వారవ్వడంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని జిల్లా ప్రజలు ఆశించారు. వైసీపీ కేడర్ ఉత్సాహంతో ఉర్రూతలూగింది. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడిచినప్పటికీ అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ చందంగా ఉంది. అదే తరుణంలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది. అందరూ కలిసికట్టుగా ఉన్నట్టు కనిపిస్తున్నా ‘చేతులతో కౌగిలించుకుంటూ .. కనులతో చిట్లించుకున్నట్లు’ పరిస్థితి తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్ కూడా ఢీలా పడినట్లు తెలుస్తోంది.
ఢీ అంటే ఢీ
వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు ఒకరికొకరు సహకరించుకుంటూ, చేదోడు వాదోడుగా నిలిచిన నాయకులు ప్రస్తుతం ఆధిపత్యం కోసం ఢీ అంటే ఢీ కొడుతున్నారు. ఒకరికి ఒకరు కలిసినప్పుడు నవ్వుతూ పలకరించుకుంటూనే తెరవెనక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుండటంతో కేడర్ కూడా విడిపోతున్నారు.
విజయనగరంలో ..
జిల్లా కేంద్రమైన విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ వెర్సెస్ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మధ్య ఢీ అంటే ఢీ అనే చందంగా పరిస్థితి ఉంది. ఈ రెండు వర్గాల కేడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పంచాయితి నేరుగా సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా సర్ధి చెప్పినట్లు, ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు తలదూర్చొద్ధని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో విజయనగరం పట్టణానికి బొత్స దూరంగా ఉంటున్నా రెండు వర్గాల మధ్య మాత్రం వైరం నివురుగప్పిన నిప్పులా ఉంటోంది.
పార్వతీపురంలో ..
జిల్లాల పునర్విభజనతో నూతన జిల్లాగా అవతరించనున్న పార్వతీపురంలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు, పక్క నియోజకవర్గం కురుపాం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురం జిల్లా కేంద్రం అవుతుందన్న ప్రచారం మధ్య ఇక్కడ పట్టు సాధించే ప్రయత్నంలో రెండు కుటుంబాలు సై అంటే సై కొడుతున్నాయి. ఏజెన్సీపై పట్టు కోసం జోగారావు చేసే పనులు డిప్యూటీ సీఎంకు తలనొప్పిగా మారుతున్నాయని ఆమె వర్గం ఆరోపిస్తోంది. పార్వతీపురంలో పట్టుకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి చేస్తున్న ప్రయత్నాలకు జోగారావు బ్రేకులు వేస్తున్నట్లు వినికిడి. అదే తరుణంలో డిప్యూటీ సీఎం నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు జోగారావు ఆదేశాలు జారీ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు విషయంలో జోగారావు, పుష్పశ్రీవాణి ఇప్పటికే ఎడముఖం.. పెడముఖంగా ఉంటున్నారని టాక్.
చీపురుపల్లిలో ..
జిల్లాలో మరో కీలక నియోజకవర్గమైన చీపురుపల్లిలో మంత్రి బొత్స, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అనుచరుల మధ్య ఆధిపత్యపోరు సాగుతోందని వినికిడి. చీపురుపల్లి బెల్లాన సొంత ఊరైనందున స్థానికంగా పట్టుకోసం ఆయన ప్రయత్నాలు చేస్తుండగా, సుసంపన్నమైన బంధుగణంతో ఇప్పటికే అక్కడ మంచి పట్టు సంపాదించుకున్న బొత్స వేరొకరికి తావులేకుండా అన్ని చర్యలూ చేపడుతున్నట్లు తెలుస్తోంది.
నెల్లిమర్ల, శృంగవరపుకోటలోనూ వైసీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ విధంగా జిల్లాలో నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి, స్థానికంగా పట్టుసాధించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సగం సమయమైనా సమష్టిగా అభివృద్ధిపై దృష్టి సారిస్తే జిల్లా ప్రగతి పథంలో పయనించేందుకు అవకాశం ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.











