చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళుతున్నారంటేనే.. అడుగు బయట పెడుతున్నారంటేనే.. కంగారు పడిపోయి.. ఆయన పర్యటనలకు ప్రభుత్వం ఆటంకాలు సృష్టించడం అలవాటుగా చేసుకుంది. ఆయన విశాఖ వెళ్లినప్పుడు.. ఎయిర్ పోర్టు దాటి బయటకు రానివ్వకుండా పోలీసులు ఎంత పెద్ద రాద్ధాంతం చేశారో అందరికీ తెలిసిన సంగతే. అలాంటి నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కళ్లకు కట్టినట్టు కనపడుతున్న దేవాలయాలపై దాడులు.. వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబునాయుడు విశాఖ నుంచి విజయనగరం వెళ్లడానికి చేస్తున్ ప్రయత్నాన్ని కొనసాగనిస్తారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లాకు రానున్నారనగానే.. జిల్లాలో స్థానికంగా తెలుగుదేశం నాయకులను అరెస్టులు చేస్తున్నారు. గృహనిర్బంధం చేస్తున్నారు. పోలీసుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఏపీలో దేవాలయాలు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం కోదండరామాలయంలో దుండగులు రాముని విగ్రహం తల ఖండించడంపై చంద్రబాబు ఉద్యమానికి సిద్దమయ్యారు. టీడీపీ అధినేత ఇవాళ రామతీర్థంలో దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే అమరావతి చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో విశాఖ ఎయర్ పోర్టులో దిగనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో రామతీర్థం చేరుకోవాలని నిర్ణయించారు.
పర్యటన సాగనిస్తారా?
ప్రఖ్యాత రామతీర్థం ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల విధ్వంసం ఘటనను పరిశీలించేందుకు చంద్రబాబునాయుడు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లడానికి బయలుదేరారు. రామతీర్థం ఆలయాన్ని దర్శించి, విగ్రహాల ధ్వంసంపై పై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. చంద్రబాబు పర్యటనతో విజయనగరం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.
అయితే చంద్రబాబు పర్యటనను పోలీసులు ముందుకు సాగనిస్తారా లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటనను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ, కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడికక్కడే పోలీసులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. అయితే తాజా పర్యటన కొనసాగనిస్తారా? విశాఖ విమానాశ్రయంలోనే అడ్డుకుంటారా? అనేది కాసేపట్లో తేలనుంది.
రోడ్డు మార్గంలో ఆటంకాలు సృష్టిస్తారా?
విశాఖ విమానాశ్రయం నుంచి విజయనగరం రామతీర్థం చేరుకునేందుకు చంద్రబాబు కాన్వాయ్ రెండు గంటలుపైగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రోడ్డు మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించే అవకాశాలు లేకపోలేదని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నాయి. అయితే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తన చంద్రబాబు పర్యటనకు బయలు దేరారని తెలుస్తోంది. టీడీపీ శ్రేణులను చంద్రబాబు పర్యటనకు రానిస్తారా? లేదా? చూడాలి.
దేవాలయాల ధ్వంసం దారుణం
ఏపీలో ఇప్పటికే 42 ప్రముఖ దేవాలయాలతో సహా మొత్తం 142 విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. అయినా ఇంత వరకు పోలీసులు ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. హిందూ దేవాలయాలపై ఇలా వరుస దాడులు జరుగుతుంటే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి, దేవుడే చూసుకుంటాడని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
దేవాలయాల ధ్వంసంపై నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని విశ్వహిందూ పరిషత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రంగంలోకి దిగడంతో దేవాలయాల ధ్వంసంపై అన్ని వర్గాల్లో కదలిక వచ్చిందనే చెప్పాలి.











