విదేశాలకు వలసలు వెళ్లి ఉద్యోగాలు,వ్యాపారాలు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. గడచిన నాలుగు దశాబ్దాల్లో వలసలు విపరీతంగా పెరిగాయి.ఇక అమెరికాలో ఉద్యోగం చేయాలని చాలా మంది విద్యార్ధుల కల. ఇలా అమెరికాలో ఉద్యోగం చేయడానికి వెళ్లిన వారు అక్కడే స్థిరపడిపోతున్నారు.వారు అక్కడే పెళ్లిళ్లు చేసుకుని, కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటున్నారు. అయితే అమెరికాలో భారతీయ అమెరికన్లపై నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఈ విషయం ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు జరిపిన సర్వేలో వెల్లడైంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు.ఒక్క అమెరికాలోనే సుమారు 46 లక్షల మంది భారతీయులు స్థిరపడిపోయారు. భారతీయ అమెకన్లపై వివక్ష కొనసాగుతోందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
ఆన్ లైన్ సర్వేలో తేలిందిలా..
అమెరికాలో భారతీయ అమెరికన్లు ఎదుర్కొంటున్న వివక్షపై కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ ఎస్ఏఐఎస్, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం సంయుక్తంగా జరిపిన సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. వివక్షకు సంబంధించిన ఫిర్యాదులు చేసిన వారిలో అన్ని దేశాల వారికన్నా భారతీయ అమెరికన్లే ఎక్కువగా ఉన్నారని సర్వేలో తేలింది. భారతీయ అమెరికన్లు వారి సామాజికవర్గంలోనే జీవిత భాగస్వామిని చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారని కూడా సర్వేలో నిగ్గుతేలింది. ప్రతి పది మందిలో 8 మంది ఇలా స్వదేశీ సంతతికి చెందిన వారినే జీవిత భాగస్వామిగా ఎంచుకుంటున్నారు. అమెరికా జీవన గమనంలో మతం కీలక పాత్ర పోషిస్తోందని, ఆ తరవాతే సామాజిక వర్గం, ప్రాంతీయతకు ప్రాధాన్యత నిస్తున్నారని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇక భారతీయ అమెరికన్లు అక్కడి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఒకే సామాజికవర్గం ప్రజల మద్య సాన్నిహిత్యం కూడా ఎక్కువగానే ఉంటోంది. భారతీయ సమాజంలోని వైవిధ్యాలను అమెరికాకు వచ్చిన వారిలోనూ గుర్తించారు. గత ఏడాది సెప్టెంబరులో ఈ సర్వే నిర్వహించారు. పరిశోధన, విశ్లేషణ సంస్థ యుగవ్ కూడా దీనిలో పాలుపంచుకుంది. అమెరికా మొత్తం జనాభాలో అమెరికన్ భారతీయులు ఒక శాతానికిపైగా అంటే దాదాపు 46 లక్షలు ఉంటారని అంచనా. భారతీయ అమెరికన్లు నిత్యం ఏదో ఒక రూపంలో వివక్ష ఎదుర్కొంటున్నారని, ప్రతి ఇద్దరిలో ఒకరు శరీర వర్ణం అధారిత వివక్ష ఎదుర్కొన్నట్టు సర్వేలో తేలింది.