విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నాయకులు జలీల్ ఖాన్, మంత్రి వెల్లంపల్లిపై విరుచుకుపడ్డారు. మంత్రి వెల్లంపల్లి ఓ బఫూన్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దుర్గగుడిలో తుక్కును కూడా మంత్రి వెల్లంపల్లి దోచుకుంటున్నాడని, సాక్ష్యాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. కోటిన్నర విలువైన స్క్రాప్ను టెండర్ లేకుండా పదిహేను లక్షలకే మంత్రి వెల్లంపల్లి కాజేశాడని జలీల్ ఖాన్ ధ్వజమెత్తారు. లంచాలు తీసుకుని అర్హత లేని వ్యక్తిని దుర్గగుడి ఈవోగా నియమించాడని జలీల్ ఖాన్ ఆరోపించారు. చివరకు దుర్గ గుడిలో భక్తులు సమర్పించిన వెంట్రుకలను కూడా మంత్రి వెల్లంపల్లి వదలడం లేదని ఆయన మండిపడ్డారు.
వెల్లంపల్లిపై త్వరలో వేటు పడుతుంది
వెల్లంపల్లి మంత్రి పదవి త్వరలో ఊడిపోవడం ఖాయమని జలీల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. మంత్రి వెల్లంపల్లి చేస్తున్న అరాచకాలన్నీ సీఎం జగన్మోహన్రెడ్డి వద్ద ఉన్నాయని, మంత్రివర్గం పునర్వవస్థీకరణ జరిగితే వెల్లంపల్లి మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు. మంత్రి వెల్లంపల్లి అవినీతిపై పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. దేవాదాయ మంత్రి వెల్లంపల్లి పాలనలోనే 143 దేవాలయాలపై దాడులు జరిగాయని జలీల్ ఖాన్ గుర్తు చేశారు. వైసీపీ పాలనపై కూడా జలీల్ ఖాన్ విమర్శలు గుప్పించారు. రేషన్ సరకులు తీసుకోవడానికి లబ్ధిదారులు రోడ్డుపై ఆరు గంటలు నిలబడాల్సి వస్తోందని జలీల్ ఖాన్ విమర్శించారు.
Must Read ;- అమ్మవారి నిధులు పక్కదారి.. దుర్గగుడిలో ఏసీబీ సోదాలు